INDvsAFG 1st T20I: స్వదేశంలో అఫ్గాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ విజయంతో ఆరంభించింది. మొహాలీ (పంజాబ్) వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గాన్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), తిలక్ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో భారత్ బోణీ చేసింది. ఐపీఎల్లో ఇదే పిచ్ (మొహాలీ) పై పదుల సంఖ్యలో మ్యాచ్లు ఆడిన జితేశ్ శర్మ.. అఫ్గాన్ బౌలర్లపై ధాటిగా ఆడాడు. 14 నెలల తర్వాత టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ రనౌట్ అయి నిరాశపరిచినా యువ బ్యాటర్లు మాత్రం భారత్కు విజయాన్ని సాధించిపెట్టారు. బ్యాటింగ్లో రాణించిన దూబే.. బౌలింగ్లోనూ రెండు ఓవర్లు వేసి తొమ్మిదిపరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఈ సిరీస్లో రెండో టీ20 ఈనెల 14న ఇండోర్ వేదికగా జరుగుతుంది.
159 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన భారత్కు తొలి ఓవర్లో రెండో బంతికే భారీ షాక్ తాకింది. సమన్వయ లోపం కారణంగా రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ఫజల్హక్ వేసిన రెండో బంతిని మిడాఫ్ దిశగా డ్రైవ్ చేశాడు. అయితే అతడు క్రీజు దాటి నాన్ స్ట్రయికర్ దాకా వచ్చినా మరో ఓపెనర్ గిల్ మాత్రం అక్కడే ఉండటంతో హిట్మ్యాన్ రనౌట్ కాక తప్పలేదు. ఫజల్హక్ వేసిన మూడో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. నాలుగో ఓవర్ వేసిన ముజీబ్ బౌలింగ్లోనూ అదే సీన్ రిపీట్ అయింది. కానీ ఐదో బంతికి గిల్.. ముందుకొచ్చి ఆడబోగా స్టంపౌట్ అయ్యాడు.
తిలక్ – దూబేల జోరు..
28 పరుగులకే ఓపెనర్లు పెవివలియన్కు చేరడంతో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే.. తిలక్ వర్మలు ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. నబీ వేసిన ఏడో ఓవర్లో శివమ్ దూబే.. మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి తిలక్ వర్మ.. కవర్స్ దిశగా బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. నవీన్ ఉల్ హక్ వేసిన 8వ ఓవర్లో తిలక్ వర్మ సిక్సర్ బాదగా దూబే బౌండరీ సాధించాడు. సాఫీగా సాగుతున్న ఈ జోడీని అజ్మతుల్లా విడదీశాడు. అతడు వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ బాదిన తిలక్.. తర్వాత బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడబోయి గుల్బాదిన్ సూపర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో 44 పరుగుల (29 బంతుల్లోనే) మూడో వికెట్ భాగస్వ్యామానికి తెరపడింది.
తిలక్ వర్మ ఔటయ్యాక బ్యాటింగ్కు వచ్చిన జితేశ్ శర్మతో కలిసి దూబే భారత్ను విజయం దిశగా నడపించాడు. గుల్బాదిన్ వేసిన 12వ ఓవర్లో దూబేతో పాటు జితేశ్లు తలా ఓ ఫోర్ బాదడంతో భారత్ స్కోరు వంద పరుగులు దాటింది. ముజీబ్ వేసిన 14వ ఓవర్లో మూడో బంతికి బౌండరీ బాదిన జితేశ్.. ఐదో బంతికి భారీ షాట్ ఆడి ఇబ్రహీం జద్రాన్కు క్యాచ్ ఇచ్చాడు. నాలుగో వికెట్కు ఈ ఇద్దరూ 31 బంతుల్లో 45 పరుగులు జోడించారు.
ఆఖరి ఆరు ఓవర్లలో భారత విజయానికి 38 పరుగులు అవసరముండగా.. దూబే, రింకూ సింగ్ (9 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు) లు మరో వికెట్ కోల్పోకుండా భారత్ విజయాన్ని ఖరారుచేశారు. దూబే 38 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టీ20లలో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ. నవీన్ ఉల్ హక్ వేసిన 18వ ఓవర్లో 6, 4 బాది ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు.