ICC : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే టెస్టు మ్యాచ్ ముగిసిన ఈ పిచ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. ఇండోర్ పిచ్ చాలా పేలవంగా ఉందని ఐసీసీ తెలిపింది. అంతేకాదు మూడు డిమెరిట్ పాయింట్లు విధించింది. ఇండోర్ పిచ్ ఐసీసీ పిచ్, ఔట్ఫీల్డ్ నియమావళి ప్రకారం లేకపోవడం మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ గమనించాడు.
మ్యాచ్ అనంతరం అతను భారత్, ఆస్ట్రేలియా జట్ల కెప్టెన్లు, మ్యాచ్ ఆఫీషియల్స్తో మాట్లాడాడు. ఆ తర్వాత ఐసీసీకి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాడు. క్రిస్ బ్రాడ్ రిపోర్టును ఐసీసీ బీసీసీఐకి పంపించింది. ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించడంపై బీసీసీఐ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అప్పీల్ చేసుకునేందుకు 14 రోజుల సమయం ఉంది.
ఇండోర్ పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాటర్లకు, బౌలర్లకు ఒకే విధంగా అనుకూలించ లేదు. ఆరంభం నుంచే స్పిన్నర్లకు సహకరించడం మొదలు పెట్టింది. ఇన్నింగ్స్ ఐదో బంతి పిచ్ను దెబ్బతీసింది. ఆ తర్వాత మరిన్ని బంతులు కూడా పిచ్ స్వరూపాన్నిదెబ్బతీశాయి. దాంతో, బంతి స్వింగ్ కాలేదు. అంతేకాదూ మ్యాచ్ ఆసాంతం బంతి అనూహ్యంగా బౌన్స్ అయింది అని బ్రాడ్ తన నివేదికలో వెల్లడించాడు. స్పిన్కు అనుకూలించిన పిచ్పై ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్కు చెలరేగిపోయాడు. 11 వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బ తీశాడు.
మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది.