న్యూఢిల్లీ: గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్లు ఆడుతున్న టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. దక్షిణాఫ్రికా పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. దీని కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. స్వదేశంలో ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం నుంచి రోహిత్, కోహ్లీ సహా పలువురు ప్రధాన ఆటగాళ్లు విశ్రాంతిలో ఉండగా.. యువ భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్నది. సఫారీ టూర్లో మొదట పరిమిత ఓవర్ల సిరీస్లు ఉండటంతో.. వాటి నుంచి కూడా తమను మినహాయించాలని రోహిత్, కోహ్లీ బోర్డును కోరడంతో.. మేనేజ్మెంట్ అంగీకరించింది. ‘వరుస సిరీస్లతో బిజీగా ఉన్న రోహిత్ శర్మ ప్రస్తుతం లండన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. పొట్టి ఫార్మాట్కు అతడు దూరమైనట్లే అనుకోవడం పొరబాటు. జట్టులో అతడిపై అపార గౌరవం ఉంది. శరీరానికి, మనసుకు రెస్ట్ కూడా అవసరమేగా’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో వన్డేలకు కేఎల్ రాహుల్, టీ20లకు సూర్యకుమార్ సారథులుగా వ్యవహరించనున్నారు. టెస్టులకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. రోహిత్ గైర్హాజరీలో పొట్టి ఫార్మాట్కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించాల్సి ఉండగా.. అతడు గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. టీ20లకు రవీంద్రజడేజాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు.
భారత జట్టు ఇటీవల ఆడిన అన్నీ టెస్టు సిరీస్ల్లో భాగమైన తెలుగు వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్.. దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక కాలేదు. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రస్తుతం దేశంలో ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్గా మన్ననలు అందుకున్న భరత్కు సెలెక్టర్లు మొండి చేయి చూపారు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ టెస్టుల్లోనూ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. వన్డేల్లో మాత్రమే వికెట్ల వెనుక విధులు నిర్వర్తిస్తున్న రాహుల్.. ఇకపై తెల్ల దుస్తుల్లోనూ కీపింగ్ చేయనున్నాడు. అతడికి రిజర్వ్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేసినా.. అతడికి తుది జట్టులో చోటు దక్కడం కల్లే! ఇక శ్రేయస్ అయ్యర్ చాన్నాళ్ల తర్వాత టెస్టు జట్టులోకి రాగా.. సీనియర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేకు చుక్కెదురైంది.
సుదీర్ఘ కాలంగా భారత టెస్టు జట్టులో ప్రధాన ప్లేయర్లుగా కొనసాగుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కెరీర్ ముగిసినట్లేనా అంటే.. ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో రాణించిన రహానేతో పాటు పుజారా జాతీయ జట్టు తరఫున చివరి టెస్టు ఆడేసినట్లే. పేలవ ఫామ్కు తోడు యువ ఆటగాళ్లతో పోటీ కారణంగా వీరికి జట్టులో చోటు దక్కలేదు. ఈ ఇద్దరి స్థానాలను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ భర్తీ చేయనున్నారు. యశస్వి ఓపెనింగ్ చేస్తే గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ మిడిలార్డర్లో బరిలోకి దిగనున్నారు. ఇక మరోవైపు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్కు కూడా దాదాపు దారులు మూసుకుపోయినట్లే!
టెస్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, యశస్వి, కోహ్లీ, శ్రేయస్, రుతురాజ్, ఇషాన్, కేఎల్ రాహుల్, అశ్విన్, జడేజా, శార్దూల్, సిరాజ్, ముఖేశ్, షమీ, బుమ్రా, ప్రసిద్ధ్.
టీ20: సూర్యకుమార్ (కెప్టెన్), యశస్వి, గిల్, రుతురాజ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయస్, ఇషాన్, జితేశ్, జడేజా, సుందర్, రవి, కుల్దీప్, అర్ష్దీప్, సిరాజ్, ముఖేశ్, దీపక్ చాహర్.
వన్డే: రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్, సంజూ శాంసన్, అక్షర్, సుందర్, కుల్దీప్, చాహల్, ముఖేశ్, అవేశ్, అర్ష్దీప్, దీపక్.