న్యూఢిల్లీ: పేలవ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన టీమ్ఇండియా.. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న సిరీస్లపై దృష్టి సారించింది. గాయం కారణంగా సఫారీ టూర్కు దూరమైన పరిమిత ఓవర్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. కండరాల గాయంతో ఇబ్బంది పడుతూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందిన హిట్మ్యాన్ ప్రస్తుతం మ్యాచ్ ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. బుధవారం అతడు యోయో టెస్టు ఎదుర్కోనుండగా.. ఆ తర్వాత జట్టును ఎంపిక చేసే చాన్స్ ఉంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మూడు వన్డేలు, కోల్కతాలో మూడు టీ20లు జరుగనున్నాయి. దీని కోసం జట్టును ఎంపిక చేయనున్న సీనియర్ సెలెక్షన్ కమిటీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది! దక్షిణాఫ్రికాతో సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్తో పాటు నాలుగేండ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న అశ్విన్పై వేటు పడే అవకాశాలున్నాయి.
హార్దిక్కు పిలుపు..
గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే టీమ్ఇండియా వెనుదిరగగా.. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు గగనమైంది. ఫిట్నెస్ ఆధారంగా కాకుండా.. కేవలం అతడి పేలవ ఫామ్ కారణంగానే పక్కన పెట్టిన సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారా చూడాలి. సఫారీ టూర్లో నయా పేస్ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. భువనేశ్వర్ నిరాశ పరిచాడు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఫర్వాలేదనిపించారు.
బుమ్రాకు రెస్ట్..
దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులతో పాటు, మూడు వన్డేలు ఆడిన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే చాన్స్లు ఉన్నాయి. పనిభారం కారణంగా ఈ రెండు సిరీస్లకు అతడిని ఎంపిక చేయకపోవచ్చు. అదే జరిగితే అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్లో ఒకరికి జట్టులో చోటు దక్కనుంది. ఇప్పటికే హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ జట్టుతో కొనసాగుతున్న విషయం తెలిసిందే!
టెస్టు కెప్టెన్గా రోహిత్!
సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ పరాజయం అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ నాయకత్వానికి సైతం విరాట్ కోహ్లీ వీడ్కోలు పలుకగా.. రోహిత్కే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. కోహ్లీ అందుబాటులో లేని రెండో టెస్టుతో పాటు.. మూడు వన్డేల సిరీస్లో భారత జట్టును నడిపించిన కేఎల్ రాహుల్ తనదైన ముద్ర వేయలేకపోగా.. నాలుగు మ్యాచ్ల్లోనూ జట్టు ఓటమి పాలైంది. అతడిని భవిష్యత్ కెప్టెన్గా చూస్తున్న టీమ్ మేనేజ్మెంట్ ప్రస్తుతానికి టెస్టు పగ్గాలు కూడా రోహిత్కే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 2023 వన్డే ప్రపంచకప్ వరకు మూడు ఫార్మాట్లలో రోహిత్నే కెప్టెన్గా కొనసాగించాలని భావిస్తున్న బోర్డు.. ఆ తర్వాత పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయనుంది.