పోర్ట్ ఎలిజబెత్: బౌలర్లు దుమ్మురేపడంతో తొలి వన్డేలో ఘన విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరు కొనసాగించలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాయి సుదర్శన్ (62; 7 ఫోర్లు, ఒక సిక్సర్) మరో హాఫ్సెంచరీ సాధించగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56; 7 ఫోర్లు) ఫిఫ్టీ కొట్టాడు.
రుతురాజ్ గైక్వాడ్ (4), తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (12), రింకూ సింగ్ (17), అక్షర్ పటేల్ (7) విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో బర్గర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో సఫారీ జట్టు 42.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. జోర్జి (119 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగగా.. హెన్రిక్స్ (52), డసెన్ (36) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్, రింకూసింగ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది.