సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల 57కిలోల క్వార్టర్స్ బౌట్లో బరిలోకి దిగిన హుసాముద్దీన్ 0-5 తేడాతో అర్థర్ బజయాన్(అర్మేనియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ విజేత అయిన హుసామ్..క్వార్టర్స్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ప్రత్యర్థి విసిరిన పవర్ఫుల్ పంచ్లకు దీటైన సమాధానం ఇవ్వలేకపోయిన ఈ ఇందూరు బాక్సర్ ఓటమివైపు నిలిచాడు. మరోవైపు మహిళల వేర్వేరు క్వార్టర్స్ బౌట్లలో అనామిక, కళావాణి సెమీస్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. మహిళల 50కిలోల క్వార్టర్స్ బౌట్లో అనామిక 5-0తేడాతో కరోలిన్ డీ అల్మైడా(బ్రెజిల్)పై అలవోక విజయం సాధించింది. మరో బౌట్లో కళావాణి 4-1తో ఫ్లోరెన్సియా లోపెజ్(అర్జెంటీనా)పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించింది. వేర్వేరు క్వార్టర్స్ బౌట్లలో జ్యోతి, వినాక్షి, సిమ్రన్జిత్ ఓటమిపాలయ్యారు.