గత మ్యాచ్ పరాజయాన్ని పక్కనపెట్టి సాధికారికతతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. బౌలింగ్లో దీప్తి శర్మ పాంచ్పటాకాతో విజృంభించడంతో ఆస్ట్రేలియాను ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన టీమ్ఇండియా.. హోరాహోరీ పోరులో విజయానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. వికెట్ కీపర్ రిచ ఘోష్ అద్వితీయ పోరాటం వృథా కాగా.. ఆసీస్ 2-0తో సిరీస్ చేజిక్కించుకుంది!
Team India | ముంబై: సొంతగడ్డపై వరుస టెస్టు విజయాలు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళల జట్టు అదే జోష్లో వన్డే సిరీస్లోనూ దుమ్మురేపాలని చూసినా.. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు గెలుపు మనదే అనిపించినా.. ఒత్తిడిని అధిగమించడంలో ఘనపాటులైన కంగారూలు పట్టు వదలక సిరీస్ కైవసం చేసుకుంది. వాంఖడే వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. లిచ్ఫీల్డ్ (63), ఎలీసా పెర్రీ (50) అర్ధశతకాలు సాధించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు పడగొట్టగా.. పూజ, శ్రేయాంక, స్నేహ్ రాణా తలా ఒక వికెట్ తీశారు. ఒక దశలో 117/1తో పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్ను దీప్తి దెబ్బకొట్టింది. అయితే మరింత ఒత్తిడి పెంచడంలో విఫలమైన మన బౌలర్లు కంగారూలకు మంచి స్కోరు చేసే అవకాశమిచ్చారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిచ ఘోష్ (96; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. జెమీమా రోడ్రిగ్స్ (44), స్మృతి మంధన (34) పోరాడారు. 218/4తో సునాయాసంగా గెలిచేలా కనిపించిన భారత్ చివర్లో ఒత్తిడికి లోనై వరుస వికెట్లు కోల్పోయింది. దీంతో సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోగా.. చివరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరంగా కాగా.. 12 రన్సే చేయగలిగింది. ఆసీస్ ఆల్రౌండర్ అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే మంగళవారం జరగనుంది.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు చూస్తూ.. ఆ జట్టు మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించింది. పేస్, స్పిన్ అనే తేడా లేకుండా కంగరూలు సాధికారతతో ముందుకు సాగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్ లిచ్ఫీల్డ్, పెర్రీ అర్ధశతకాలతో మంచి జోరు మీదున్న సమయంలో బంతినందుకున్న దీప్తి.. కంగారూలను కట్టడి చేయడంలో సఫలమైంది. మొదట పెర్రీని బుట్టలో వేసుకున్న దీప్తి.. ఆ తర్వాత బెత్ మూనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. కాసేపటికి లిచ్ఫీల్డ్ ఔట్ కాగా.. చివర్లో అనాబెల్ (23), జార్జియి (22), అలానా (28 నాటౌట్) కీలక పరుగులు జోడించి ఆసీస్కు మంచి స్కోరు అందించారు.
చేజింగ్లో భారత్కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. గత మ్యాచ్లో రాణించిన యస్తిక భాటియా (14) ఏడో ఓవర్లో వెనుదిరగగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఆకట్టుకుంది. అయితే భారత ఇన్నింగ్స్ను నడిపించి ఘనత మాత్రం రిచకే దక్కుతుంది. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన రిచ అర్ధశతకం అనంతరం ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. జెమీమా సహకారంతో జట్టును విజయతీరాలకు చేరువ చేసే ప్రయత్నం చేసిన రిచ.. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ పేలవ ఆటతీరుతో వికెట్ పారేసుకోవడంతో జట్టుకు పరాజయం తప్పలేదు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న భారత ఆల్రౌండర్ స్నేహ్ రాణా సహచర ఫీల్డర్ను ఢీకొనడంతో తలకు గాయమైంది. అనంతరం తల తిరిగినట్లు అనిపిస్తుందని స్నేహ్ రాణా చెప్పడంతో వెంటనే ఆమెను వైద్య సాయం కోసం పంపారు. స్నేహ్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్లీన్ డియోల్ మిగిలిన మ్యాచ్ ఆడింది.
ఆస్ట్రేలియా: 258/8 (లిచ్ఫీల్డ్ 63, ఎలీసా పెర్రీ 50; దీప్తి శర్మ 5/38), భారత్: 255/8 (రిచ 96, జెమీమా 96; అనాబెల్ 3/47).