శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రీడాకారిణి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ లో నయా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సేన అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్ లో 2-0 ఆధిక్యం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది.
పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి లంకకు బ్యాటింగ్ అప్పజెప్పిన భారత్.. ఆ జట్టును కోలుకోనీయలేదు. టీమిండియా పేసర్ రేణుకా సింగ్ ధాటికి లంక విలవిల్లాడింది. ఓపెనర్ హసిని పెరెరా డకౌట్ అవగా విష్మి గుణరత్నె (3), మాధవి (0) విఫలమైంది. ఈ మూడు వికెట్లు రేణుకాకే దక్కాయి. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది లంక.
వరుసగా వికెట్లు పడుతున్నా కెప్టెన్ చమిర ఆటపట్టు (27), నీలాక్షి డిసిల్వ (32), అనుష్క సంజీవని (25) లు సైతం నిలదొక్కుకోలేకపోయారు. అమ కాంచన (47) కాస్త మెరుగ్గా ఆడింది. ఫలితంగా లంక నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. రేణుకా సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మేఘనా సింగ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్టార్ ఓపెనర్లు స్మృతి మంధాన (83 బంతుల్లో 94 నాటౌట్.. 11 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (71 బంతుల్లో 71 నాటౌట్.. 4 ఫోర్లు, 1 సిక్సర్) లు 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపడేశారు. ఈ మ్యాచ్ లో లంకను దెబ్బతీసిన రేణుకా సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ లో చివరిదైన మూడో వన్డే జులై 7న ఇదే వేదికలో జరుగుతుంది.
Renuka Singh scalped 4⃣ wickets & bagged the Player of the Match award as #TeamIndia won the second #SLvIND ODI. 👏 👏
Scorecard 👉 https://t.co/XOkhAjSAUt pic.twitter.com/YxWvZ212ed
— BCCI Women (@BCCIWomen) July 4, 2022