Deepti Sharma: భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తిశర్మకు అరుదైన గౌరవం దక్కింది. 26 ఏండ్ల ఈ ఆల్ రౌండర్కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డీఎస్పీ హోదాను ఇచ్చింది. గత కొంతకాలంగా భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న దీప్తి.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా (అవధ్పురి) కు చెందిన అమ్మాయే. తాజాగా లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. దీప్తికి డీఎస్పీ నియామక పత్రంతో పాటు రూ. 3 కోట్ల నగదు బహుమానాన్ని కూడా అందజేశారు. గతేడాది ముగిసిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవడంతో పాటు 2022లో కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించిన భారత జట్టులో దీప్తి సభ్యురాలిగా ఉంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సత్కారం లభించినందుకు దీప్తి కూడా హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆదిత్యానాథ్ నుంచి డీఎస్పీ నియామక పత్రంతో పాటు నగదు బహుమానాన్ని అందుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది. 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దీప్తి.. ఇప్పటివరకూ 194 అంతర్జాతీయ మ్యాచ్లలో 229 వికెట్లు పడగొట్టింది.
Humbled by the Chief Minister of UP @myogiadityanath recognized for excellence in the Asian Games and my appointment as DSP in UP Police. Forever grateful. 🙏✨🧡 #Asiangames2023 #Upgovernment #Award #DSP #gratefull #DS6 pic.twitter.com/G0TbtAfKnA
— Deepti Sharma (@Deepti_Sharma06) January 29, 2024
బంతితో పాటు బ్యాట్తోనూ రాణించే దీప్తి.. భారత జట్టు 2018, 2022లలో ఆసియా కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. 2022లో కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టు రజతం (ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి) గెలవగా 2023లో హాంగ్జౌ వేదికగా నిర్వహించిన ఆసియా గేమ్స్లో స్వర్ణం నెగ్గింది. ఈ రెండు మెగా ఈవెంట్స్లోనూ దీప్తి తనదైన ముద్ర వేసింది. గతేడాది డిసెంబర్లో దీప్తి ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్లోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్టులలో ఆమె తన స్పిన్ మాయతో రెండు అగ్రశ్రేణి జట్లకు చుక్కలు చూపించింది. యూపీ ప్రభుత్వం తనకు డీఎస్పీ హోదానివ్వడంతో పాటు నగదు బహుమానం అందించడంపై స్పందించిన దీప్తి.. దేశంలో మహిళల క్రికెట్కు తనవంతు కృషి చేస్తానని తెలిపింది.