ఇంగ్లండ్ చేరిన భారత జట్లు
లండన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కోసం ఇంగ్లండ్ బయలుదేరిన టీమ్ఇండియా గురువారం ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టింది. చాన్నాళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడనున్న భారత మహిళల జట్టు కూడా కోహ్లీసేనతో పాటే ఇంగ్లండ్కు చేరింది. ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్న కోహ్లీ సేన, మిథాలీ బృందాలు 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్లు కలిసి ఒకే విమానంలో ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సౌతాంప్టన్ వేదికగా ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో కోహ్లీ సేన తలపడనుండగా.. మిథాలీ బృందం ఏడేండ్ల తర్వాత ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది.
మూడు రోజుల కఠిన క్వారంటైన్
కొవిడ్-19 పరీక్షల అనంతరం సౌతాంప్టన్లో మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉండనున్న ఇరు జట్లు ఆ తర్వాత ప్రాక్టీస్ ప్రారంభించనున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇంగ్లండ్తో కోహ్లీసేన ఐదు టెస్టుల సిరీస్ ఆడనుండగా.. ఇంగ్లండ్ మహిళల జట్టుతో భారత మహిళలు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్నారు.