PV Sindhu | పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 13-21, 21-10, 21-14 తేడాతో బివాన్ జాంగ్(అమెరికా)పై అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో తొలిసారి క్వార్టర్స్ చేరి సత్తాచాటింది. ఇటీవలే గాయం నుంచి తేరుకున్న సింధు తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించింది. పారిస్ ఒలింపిక్స్లో ఎలాగైనా పతకం సాధించాలన్న కసితో సింధు దూకుడు కనబరిచింది.
అయితే తొలి గేమ్లో సింధు ఓవైపు అనవసర తప్పిదాలకు పాల్పడితే..జాంగ్ క్రాస్కోర్ట్ షార్ట్లతో కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మొదటి గేమ్ను దక్కించుకున్న జోష్తో రెండో గేమ్లోనూ జాంగ్ 3-0 ఆధిక్యం కనబరిచింది. ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చిన సింధు మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయిన సింధు..రెండో గేమ్ను దక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ అదే జోష్ కనబరిచినా.. ఈ తెలుగు షట్లర్ మ్యాచ్ను కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్..21-19, 12-21, 20-22 తేడాతో లు గువాంగ్ జు(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.