Nikhat Zareen | సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్తో పాటు అరుంధతి చౌదరీ టోర్నీలో కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన మహిళల 50కిలోల క్వార్టర్స్ బౌట్లో నిఖత్ 5-0తో ఖాదిరి వాసిలా(ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించింది. వీరిద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఆది నుంచే ఇద్దరు బాక్సర్లు దూకుడు ప్రదర్శించడంతో బౌట్ రసవత్తరంగా జరిగింది.
ఈ క్రమంలో నిఖత్, ఫ్రాన్స్ బాక్సర్ ఒకరిపై ఒకరు పదునైన పంచ్లతో విరుచుకుపడ్డారు. అయితే ఇందూరు బాక్సర్ దీటైన సమాధానమిచ్చింది. ఫ్రాన్స్ బాక్సర్కు ఎక్కడా అవకాశమివ్వని నిఖత్ మరింత జోరు పెంచి ఎదురుదాడికి పాల్పడింది. దీంతో తొలి రౌండ్ ముగిసే సరికి నిఖత్ 3-2 ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్లోనూ ఇద్దరు బాక్సర్లు ఎదురుదాడి విషయంలో ఒకింత వెనుక్కు తగ్గారు. అయినా జరీన్ 3-2తో ఆధిక్యం కనబరిచింది. కీలకమైన మూడో రౌండ్లో తన అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ప్రత్యర్థి విసిరిన పంచ్లను నిఖత్ సమర్థంగా తిప్పికొట్టింది.
శనివారం జరిగే సెమీస్లో లోకల్ ఫెవరేట్ జల్టిస్లవా చుకనోవా (బల్గేరియా) బాక్సర్తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు 66కిలోల కేటగిరీలో జాతీయ చాంపియన్ అరుంధతి చౌదరీ 5-0 తో మాటోవిచ్ మిలేనా(సెర్బియా)పై అలవోకగా గెలిచింది. ఈ ఇద్దరు బాక్సర్లు మొదటి నుంచే దూకుడు కనబరిచినా.. అరుంధతి పంచ్ల వర్షం కురిపించింది. అప్పటికే బౌట్పై తన ఆధిపత్యం ప్రదర్శించిన అరుంధతి ఓవైపు దాడులను తిప్పికొడుతూ పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
ఫైనల్లో చోటు కోసం స్లోవేకియా బాక్సర్ జెస్సికా ట్రిబ్లెవాతో అరుంధతి తలపడుతుంది. 57కిలోల విభాగం క్వార్టర్స్లో సాక్షి 2-3తో మమాజొనోవా కుమ్రోబోను(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75కి), నవీన్కుమార్ (92కి) ప్రత్యర్థులపై విజయాలతో క్వార్టర్స్లోకి ప్రవేశించారు.