దుబాయ్ : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్కు చేరుకున్నారు. కాగా కిడాంబి శ్రీకాంత్ ఇంటిదారిపట్టాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో సింధు 21-12, 21-15 స్కోరుతో 33 నిమిషాలలో చైనాకు చెందిన హాన్ యుపై గెలుపొందగా, ఎనిమిదో సీడ్ ప్రణయ్ గంట రెండు నిమిషాలలో 21-16, 5-21, 21-19తో ఇండోనేసియాకు చెందిన చికొ ఔరా ద్వి వార్దొయొపై గెలుపొందాడు.
శ్రీకాంత్ 14-21, 22-20, 9-21తో నాలుగో సీడ్ జపాన్ ఆటగాడు కొడై నరవొక చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ -చిరాగ్శెట్టి జోడి 21-13, 21-11తో జిన్ యాంగ్-న సంగ్ సియంగ్పై గెలుపొందగా, మిక్స్డ్ డబుల్స్ జోడి రోహన్ కపూర్-సిక్కిరెడ్డి వాకోవర్ లభించడంతో క్వార్టర్ఫైనల్కు చేరారు.