షెన్జెన్ : చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డారు. టైటిల్ పోరులో సాత్విక్-చిరాగ్ 71 నిమిషాలలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్1 జోడి లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చాంగ్ చేతిలో 19-21, 21-18, 19-21 స్కోరుతో ఓడిపోయారు. ఆద్యంతం విజయం దోబూచులాడిన పోరులో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడాయి. తొలి గేమ్ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్ను మూడు పాయింట్ల తేడాతో గెలుచుకుని పోరులో నిలిచింది.
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగింది. 1-8తో వెనుకంజలో ఉన్న భారత జోడి తరువాత అంతరాన్ని తగ్గించింది. ఆపై 13-20తో వెనుబాటులో ఉన్న సాత్విక్-చిరాగ్ ఆరు చాంపియన్షిప్ పాయింట్లను కాచుకుని స్కోరును 19-20కి చేర్చారు. ఈ దశలో చైనా జోడి తమ అనుభవాన్నంతా రంగరించి గేమ్తోపాటు టైటిల్ను దక్కించుకున్నారు. గత ఎనిమిదేళ్లలో ఈ టోర్నీలో చైనాకు దక్కిన తొలి టైటిల్ ఇది. ఈ విజయంతో ఆసియన్ క్రీడల్లో భారత జోడి చేతిలో పరాజయానికి చైనా జంట ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.