గతమెంతో ఘనమంటూ చరిత్ర చెప్పుకొని సరిపెట్టుకుంటున్న భారత హాకీ అభిమానులకు మన్ప్రీత్సింగ్ సేన తీపికబురు చెప్పింది. 49 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్కు అర్హత సాధించి శెభాష్ అనిపించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో గ్రేట్ బ్రిటన్పై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. భారత్ తరఫున దిల్ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), గుర్జాంత్ సింగ్ (16వ ని), హార్దిక్ సింగ్ (57వ ని) ఒక్కో గోల్ కొట్టారు. బ్రిటన్ తరఫున సామ్ వార్డ్ (45వ ని) ఏకైక గోల్ సాధించాడు. ఎనిమిది సార్లు ఒలింపిక్ చాంపియన్గా నిలిచిన భారత జట్టు.. మంగళవారం జరుగనున్న సెమీఫైనల్ పోరులో ప్రపంచ చాంపియన్ బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. విశ్వక్రీడల్లో భారత్ చివరి సారి 1980లో స్వర్ణ పతకం సాధించగా.. అప్పుడు ఒలింపిక్స్లో ఆరు జట్లే పాల్గొనడంతో సెమీ ఫైనల్ నిర్వహించలేదు. ఈ లెక్కన 1972 మ్యూనిచ్ విశ్వ క్రీడల్లో సెమీస్ చేరిన తర్వాత భారత్ మరోసారి ఈ ఘనత సాధించడం ఇదేతొలిసారి.