సింగపూర్: భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ జోడీకి చెక్ పెడుతూ ఫైనల్కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్-చిరాగ్ 21-19, 21-18 తేడాతో టాప్ సీడ్స్ కిమ్ వోన్ హో- సియో స్యూంగ్ జే (కొరియా)పై వరుస గేమ్స్లో విజయం సాధించింది. 52 నిమిషాల హోరాహోరీ పోరులో తొలి గేమ్లో విరామ సమయానికి కొరియా జోడీ 13-11 తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. అయితే సాత్విక్-చిరాగ్ వెంటనే తేరుకుని కీలక పాయింట్లు సాధించి తొలి గేమ్ను కైవసం చేసుకుంది. రెండో గేమ్లోనూ ఇండియా జోడీకి మొదట్లో సవాలు ఎదురైంది. ఒక దశలో 11-14 తో వెనుకబడినా ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఆడి ప్రత్యర్థి పని పట్టింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ధృవ్ కపిల- తనీషా క్రాస్టో 16-21, 21-17, 13-21 తేడాతో యు యిచీ షిమోగామి- సయాకా హోబరా (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.