భోపాల్: మ్యాచ్లు, విదేశీ పర్యటనలు అంటూ నిత్యం బిజీ షెడ్యూల్తో ఉండే టీమ్ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు. అఫ్గానిస్థాన్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భారత జట్టు ఆదివారం రెండో టీ20 ఆడిన విషయం తెలిసిందే. జట్టులోని సభ్యులు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్.. సోమవారం వేకువజామున ఉజ్జయినీలోని శ్రీ మహాకాలేశ్వర్ ఆలయంలో జరిగిన భస్మ హారతి (Bhasma Aarti) కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాధారణ భక్తులతోపాటు నందీ హాల్లో ముందు వరుసలో కూర్చున్న క్రికెటర్లు శివయ్య అభిషేకాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు. అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు. పూజ ముగిసిన తర్వాత కూడా చాలాసేపు ఆలయం ప్రాంగణంలోనే గడిపారు.
అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్, 5ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఓపెనర్ రోహిత్శర్మ(0) వరుసగా రెండో మ్యాచ్లో పరుగుల ఖాతా తెరువకుండానే సున్నాకు వెనుదిరిగాడు. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ(29) టచ్లోకి వచ్చాడు. కరీమ్ జనత్(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గులాబ్దిన్ నయీబ్(57) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సహచర బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. ప్రత్యర్థి తన బౌలింగ్తో కట్టడి చేసిన అక్షర్ పటేల్(2/17)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మూడో మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరుగనుంది.
#WATCH | Madhya Pradesh | Indian cricketers Tilak Varma, Washington Sundar, Jitesh Sharma & Ravi Bishnoi attend ‘Bhasma Aarti’ performed at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/PGYyiS809h
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) January 14, 2024