కొలంబో: శ్రీలంకతో సిరీస్ కోసం వెళ్లిన టీమిండియా అక్కడ క్వారంటైన్ పూర్తి చేసుకుంది. దీంతో టీమ్ ప్లేయర్స్ అందరూ కలిసి హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు. అందరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్ కోసం స్టాండిన్ కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఇండియన్ టీమ్ వెళ్లిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల తర్వాత మూడు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. క్రికెటర్లు పూల్లో దిగిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది.
క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన సంబరం అని బోర్డు దానికి క్యాప్షన్ పెట్టింది. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ ఫొటోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. అటు సీనియర్ క్రికెటర్లు ఇంగ్లండ్లో తమకు దొరికిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీస్తో గడపడానికి కేటాయిస్తుండగా.. ఇటు ఈ యువ క్రికెటర్లు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.