నిఖత్ జరీన్ ఎన్నో
కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరింది. కేవలం పురుషుల ఆధిపత్యం కనిపించే బాక్సింగ్లో నా బిడ్డ ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాను. నమ్మకాన్ని నిలబెడుతూ అనేక విజయాలను సొంతం చేసుకోవడంతో పాటుగా దేశానికి, రాష్ర్టానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకురావడం ఎంతో గర్వకారణం. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారం ఎన్నటికీ మరువలేం.
– మహమ్మద్ జమీల్ అహ్మద్, నిఖత్ తండ్రి
నిరూపించుకోవాలనే తపన.. సాధించాలనే కసి.. లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే విజయం పాదక్రాంతమవుతుందని యువ బాక్సర్ నిఖత్ జరీన్ చేతల్లో చూపిస్తున్నది. ఆడపిల్లకు ఆటలేందుకు? అమ్మాయిలకు బాక్సింగ్ అవసరమా? వంటి ఎన్నో అవమానాలను దాటుకొని.. ఒక్కో మెట్టు ఎక్కిన నిఖత్ అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నది. పురుషుల క్రీడగా ముద్రపడ్డ బాక్సింగ్పై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న ఈ ఇందూరు అమ్మాయి.. తండ్రి ప్రోత్సాహంతో రింగ్లో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగింది. ప్రపంచ చాంపియన్గా నిలిచి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన నిఖత్.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం…
వ్వుపుట్టగానే పరిమలించింది అన్నట్లు.. నిఖత్ ఊహ తెలిసిన వయసు నుంచే బాక్సింగ్లో సత్తాచాటుతూ వచ్చింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిజామాబాద్లో సాధన షురూ చేసిన నిఖత్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు ప్రపంచస్థాయి బాక్సర్గా ప్రశంసలు అందుకుంటున్నంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో తనదైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తున్నది. 2011లో టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచి తన ఆగమనాన్ని ఘనంగా చాటిన నిఖత్.. ఆ తర్వాత జూనియర్ స్థాయిలో మరె న్నో విజయాలు నమోదు చేసుకుంది. 2012, 2013లో సెర్బియా, బల్గేరియాలో రజత పతకాలు, అనంతరం అండర్-19 విభాగంలో వరుసగా బంగారు పతకాలను సొంతం చేసుకుంది. 2015లో సీనియర్ విభాగంలో పోటీపడిన తొలి సారే నిఖత్ జాతీయ చాంపియన్గా నిలిచింది.
అప్పటి వరకు నిలకడగా పతకాలు సాధిస్తున్నా నిఖత్కు రావాల్సినంత గుర్తింపు దక్కలేదు. అయితే 2019లో బల్గేరియా వేదికగా జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలో నిఖత్ పంచ్ పవర్కు ప్రపంచం ఆమె వైపు చూసింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని నిఖత్.. అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. టోక్యో ఒలింపిక్స్కు మన దేశం నుంచి మేరీకోమ్ను నేరుగా ఎంపిక చేయడంపై న్యాయ పోరాటానికి దిగడంతో వార్తల్లోకెక్కిన నిఖత్.. ఆమెతో క్వాలిఫయింగ్ బౌట్లో పోరాడి ఓడింది. ఈ కసినంతా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో చూపిన నిఖత్.. టర్కీ వేదికగా జరిగిన మెగాటోర్నీలో విశ్వవిజేతగా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత మహిళా బాక్సర్గా చరిత్రకెక్కింది. అనంతరం బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ స్వర్ణ పతకం కొల్లగొట్టి తన గెలుపు గాలివాటం కాదని నిరూపించింది. ఎప్పటికైనా ఒలింపిక్ పతకం నెగ్గడమే తన లక్ష్యమంటున్న నిఖత్కు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం!
బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి కొన్ని క్రీడల్లో మినహాయిస్తే.. బాక్సింగ్, రెజ్లింగ్ వంటి వాటిలో దక్షిణాది రాష్ర్టాల ప్లేయర్ల ప్రాతినిధ్యం తక్కువే. అలాంటి స్థితిలో నిఖత్ ఉత్తుంగ తరంగంలా దూసుకొచ్చింది. ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్, కామన్వెల్త్ స్వర్ణంతో తనపై అంచనాలు పెంచేసింది. మూడో సంతానమైన నిఖత్ ఆసక్తిని గమనించి స్థానికంగా శంసుద్దీన్ వద్ద బాక్సింగ్లో శిక్షణ ఇప్పించారు.
కెరీర్ ఆరంభించిన తొలి నాళ్ల నుంచి నిఖత్కు ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. శిక్షణకు ఆర్థిక సాయం అందించడంతో పాటు.. వివిధ దేశాల్లో జరిగే టోర్నీల్లో పాల్గొనేందుకు ఇతోధిక సాయం చేశారు. జయాపజయాల్లో ఎమ్మెల్సీ కవిత అందించిన ప్రోత్సాహం మరువలేనిదని నిఖత్ పలుమార్లు పేర్కొంది. నిఖత్ ప్రపంచ చాంపియన్గా నిలువడం రాష్ట్రంతో పాటు, దేశానికే గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇక నిఖత్ ప్రతి అడుగులోనూ సీఎం కేసీఆర్ మార్గదర్శకుడిలా నిలిచారు. ఆమె విజయాన్ని తన విజయంలా భావించి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. అవసరమైన ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సాయమందించడం వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నిఖత్ చెప్పింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. తన అసమాన ప్రతిభతో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు హైదరాబాద్లో ఇంటి స్థలం, డీఎస్పీ పోస్ట్ ఇచ్చి గౌరవించింది.
– నిజామాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: