Asian Games | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. సెంచరీ కొట్టడమే లక్ష్యంగా చైనాలో అడుగుపెట్టిన భారత బృందం.. ఇప్పుడా సంఖ్యను అవలీలగా దాటేసింది. ఇప్పటికే మనవాళ్లు 95 మెడల్స్ ఖాతాలో వేసుకోగా.. మరిన్నీ క్రీడాంశాల్లో పతకాలు ఖాయమయ్యాయి. శుక్రవారం పురుషుల జట్టు పూర్తి ఆధిపత్యంతో స్వర్ణం నెగ్గగా.. రెజ్లింగ్లో మూడు మెడల్స్.. సెపక్తక్రాలో చారిత్రక కాంస్యం మన ఖాతాలో చేరాయి.
హాంగ్జౌ: ఐదేండ్ల క్రితం జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించగా.. ఈ సారి వంద మెడల్స్ సాధించాలనే లక్ష్యంతో హాంగ్జౌ చేరిన భారత్.. ఇప్పుడా సంఖ్యను దాటి ముందుకు సాగుతోంది. ఇప్పటికే 95 మెడల్స్ (22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు) ఖాతాలో వేసుకున్న భారత్.. కబడ్డీ (2), ఆర్చరీ (3), హాకీ (1), బ్యాడ్మింటన్ (1), క్రికెట్ (1)లో పతకాలు ఖాయం చేసుకుంది. శనివారం మనవాళ్లు సెంచరీ మార్క్ దాటడం ఖాయమే. రెజ్లర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే.. భారత్ ఖాతాలో మరిన్న పతకాలు చేరే అవకాశం కూడా ఉంది. ఇక శుక్రవారం పోటీల్లో అనధికారిక జాతీయ క్రీడ హాకీలో పురుషుల జట్టు దుమ్మురేపింది. ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 5-1తో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను మట్టికరిపించింది. హర్మన్ప్రీత్ (32వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో మెరిస్తే.. అమిత్ రొహిదాస్ (36వ ని.), మన్ప్రీత్ సింగ్ (25వ ని.), అభిషేక్ (48వ ని.) ఒక్కో గోల్ చేశారు. జపాన్పై ఏకపక్ష విజయంతో పసిడి పతకంతో పాటు భారత జట్టు వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది.
బ్రిడ్జ్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు రజతం కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో 41 ఏండ్ల తర్వాత భారత షట్లర్కు ఆసియా క్రీడల్లో పతకం దక్కింది. హెచ్ఎస్ ప్రణయ్ కంచుమోత మోగించాడు. మరోవైపు పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్కు చేరాయి. సెపక్తక్రాలో భారత్కు చారిత్రక కాంస్యం లభించింది. ఆర్చరీలో రికర్వ్ టీమ్ విభాగాల్లో భారత్కు రెండు పతకాలు దక్కాయి. రెజ్లింగ్లో అమన్ షెరావత్ కాంస్యం గెలుచుకున్నాడు.