సంచలనాలకు తావివ్వకుండా.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా.. సిరీస్ సమం చేసింది. ఉప్పల్ టెస్టులో బజ్బాల్ ఆటతీరుతో అనూహ్య విజయం అందుకున్న ఇంగ్లండ్.. వైజాగ్లో సేమ్ సీన్ రిపీట్ చేయలేకపోయింది!
399 పరుగుల లక్ష్యఛేదనలో 67/1తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ను మన బౌలర్లు నిలువరించారు. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లతో విజృంభించగా.. బ్యాటింగ్లో రాణించలేకపోయిన అయ్యర్ చక్కటి త్రోతో స్టోక్స్ను రనౌట్ చేయడంతో మ్యాచ్ మన వశమైంది!!
‘60 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిస్తాం’ అని బీరాలు పలికిన ఇంగ్లండ్ ఆటగాళ్ల మెడలు వంచిన రోహిత్ సేన.. 1-1తో సిరీస్ సమం చేసింది. కాస్త విరామం అనంతరం ఈనెల 15 నుంచి రాజ్కోట్లో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Team India | విశాఖపట్నం: దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది. 399 పరుగుల చేజింగ్లో ఓవర్నైట్ స్కోరు 67/1తో సోమవారం నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 292 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా 106 పరుగుల తేడాతో జయకేతనం ఎగరవేసిన టీమ్ఇండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. రికార్డు ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లు నిలకడ చూపలేకపోయారు. దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. జాక్ క్రాలీ (73; 8 ఫోర్లు, ఒక సిక్సర్) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా.. బెన్ డకెట్ (28), రెహాన్ అహ్మద్ (23), ఓలీ పోప్ (23), రూట్ (16), బెయిర్స్టో (26), కెప్టెన్ స్టోక్స్ (11), బెన్ ఫోక్స్ (36), టామ్ హార్ట్లీ (36) ఓ మాదిరిగా ఆడారు. ఇన్నింగ్స్ను నడిపించే సత్తా ఉన్న సీనియర్ బ్యాటర్ జో రూట్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇంగ్లండ్తో రెండో టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఈ మ్యాచ్కు ముందు ఆరో ప్లేస్లో ఉన్న రోహిత్ సేన నాలుగు స్థానాలు ఎగబాకి 52.77 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది.
లక్ష్యం భారీగానే ఉన్నా.. ప్రత్యర్థి దూకుడు మీద ఉండటంతో కాస్త ఆందోళన చెందిన టీమ్ఇండియాకు.. ఊరటనిచ్చే విజయం దక్కింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో శాసించే స్థితి నుంచి మ్యాచ్ను చేజార్చుకున్న రోహిత్సేన.. వైజాగ్లో ఆ తప్పు చేయలేదు. ‘బజ్బాల్’తో కౌంటర్ ఇద్దామనుకున్న ఇంగ్లిష్ బ్యాటర్లను.. మనవాళ్లు చక్కటి బౌలింగ్తో చుక్కలు చూపారు. సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జో రూట్ ఈ సిరీస్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం ఆ జట్టను దెబ్బకొట్టింది. భారీ లక్ష్యఛేదనలో మిగిలినవాళ్లంతా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా.. మరో ఎండ్లో రూట్ పాతుకుపోయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఏదేమైనా.. లక్ష్యాన్ని ఛేదించేందుకే ప్రయత్నిస్తామని బల్లగుద్ది చెప్పిన స్టోక్స్.. మ్యాచ్ అనంతరం తమ ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు. కాస్త దూరంలో నిలిచిపోయామని జట్టు సభ్యులను అభినందించాడు.
తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ వెన్నులో వణుకు పుట్టించిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లోనూ మూడు కీలక వికెట్లు ఖాతాలో వేసుకోగా.. అశ్విన్ మిగిలిన పని కానిచ్చాడు. గాయం కారణంగా గిల్ నాలుగో రోజు ఫీల్డింగ్కు దూరం కాగా.. మనవాళ్లు ఫీల్డింగ్లోనూ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఓలీ పోప్ స్లిప్లో ఇచ్చిన షార్ప్ క్యాచ్ను రోహిత్ ఒడిసి పట్టిన తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన క్రీజులో అడుగుపెట్టి అసమాన పోరాటాలు చేసిన అనుభవం ఉన్న స్టోక్స్ను శ్రేయస్ చక్కటి త్రోతో డగౌట్ బాట పట్టించగా.. చివర్లో ఫోక్స్, హార్ట్లీ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కావడంతో మూడో మ్యాచ్కు ముందు ఇరు జట్లకు సుదీర్ఘ విరామం లభించనుండగా.. గాయాల బారిన పడిన భారత ప్లేయర్లకు అప్పటి వరకు కోలుకుంటారా లేదో చూడాలి! ఇషాన్ కిషన్ తిరిగి దేశవాళీల్లో రాణిస్తేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించగా.. గణాంకాలను పట్టించుకోనని బుమ్రా వెల్లడించాడు.
-నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
1 ఇంగ్లండ్పై అత్యధిక (97) వికెట్లు తీసిన భారత బౌలర్గా అశ్విన్ చరిత్రకెక్కాడు. బీఎస్ చంద్రశేఖర్ (95) రెండో స్థానంలో ఉన్నాడు.
2 టెస్టు క్రికెట్లో బుమ్రాకు ఇది (9/91) రెండో అత్యుత్తమ ప్రదర్శన. 2018లో ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో బుమ్రా 86 పరుగులకే 9 వికెట్లు తీశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 396;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253;
భారత్ రెండో ఇన్నింగ్స్: 255;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 292 (క్రాలీ 73, హార్ట్లీ 36; బుమ్రా 3/46, అశ్విన్ 3/72).