బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల వీరవిహారం తోడవడంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ హర్మన్, యస్తిక భాటియా అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని తుత్తినియలు చేస్తూ ఈ ముగ్గురూ బౌండ్రీలతో విరుచుకుపడ్డారు.
హోవ్: పొట్టి ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత మహిళల క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 7 వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 227 పరుగులు చేసింది. అలీస్ రిచర్డ్స్ (50 నాటౌట్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. డానీ వ్యాట్ (43), ఎకిల్స్టోన్ (31) రాణించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. ఈ సిరీస్తో కెరీర్కు వీడ్కోలు పలుకనున్న సీనియర్ పేసర్ జులన్ గోస్వామి 10 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 44.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 232 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (91; 10 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టగా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (74 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), యస్తిక భాటియా (50; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో వన్డే జరుగనుంది.
ఆరంభం నుంచి ఎదురుదాడి
ఓ మాదిరి లక్ష్యఛేదనలో మన అమ్మాయిలకు శుభారంభం దక్కలేదు. విధ్వంసక ఓపెనర్ షఫాలీ వర్మ రెండో ఓవర్లోనే వెనుదిరగగా.. యస్తికతో కలిసి స్మృతి ఇన్నింగ్స్ను నిర్మించింది. ఆచితూచి ఆడుతూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు పెంచింది. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన యస్తిక అర్ధశతకం అనంతరం వెనుదిరగగా.. కాసేపటికే మందన హాఫ్ సెంచరీ మార్క్ చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించింది. సెంచరీకి చేరువలో మందన వెనుదిరిగిన హర్మన్ పని పూర్తి చేసింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 50 ఓవర్లలో 227/7 (అలీస్ రిచర్డ్స్ 50 నాటౌట్, వ్యాట్ 43; దీప్తి 2/33, జులన్ 1/20), భారత్: 44.2 ఓవర్లలో 232/3 (స్మృతి మందన 91, హర్మన్ప్రీత్ కౌర్ 74 నాటౌట్; కేట్ క్రాస్ 2/43).