మీర్పూర్: బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 45/4తో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్ స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. అయితే శ్రేయస్ అయ్యర్, అశ్విన్ జట్టును ఆదుకున్నారు. సమయ స్ఫూర్తితో బ్యాటింగ్ చేసిన ఇద్దరు.. మరో వికెట్ కోల్పోకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.
శనివారం 145 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్ఇండియా బ్యాటర్లను బంగ్లా బౌలర్లు కోలుకోలేని దెబ్బకొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (2), శుభ్మన్ గిల్ (7), చతేశ్వర్ పుజారా (6), విరాట్ కోహ్లీ (1) వికెట్లను వెంటవెంటనే పడగొట్టారు. దీంతో 45 పరుగులకే 4 కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. 45 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన అక్షర్ పటేల్, ఉనాద్కట్ను బంగ్లా బౌలర్లు పెవీలియన్కు పంపించారు. తొమ్మిది బాల్స్ తేడాతో అక్షర్, పంత్ వికెట్లను భారత్ కోల్పోయింది. ఈ దశలో క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(29).. సీనియర్ బౌలర్ అశ్విన్ (42)తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. బంగ్లా బౌలర్లు మిరాజ్ 5 వికెట్లు, షకీబ్ 2 వికెట్ల చొప్పున తీశారు.
తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 227 పరుగులు చేయగా, భారత్ 314 రన్స్కు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లా 231, టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.