భారత్ ఖాతాలో మరో టీ20 సిరీస్. గత ఐదేండ్ల(2019) నుంచి ప్రత్యర్థికి సిరీస్ చేజార్చుకోని టీమ్ఇండియా అప్రతిహత విజయయాత్రను కొనసాగిస్తున్నది. మరో మ్యాచ్ మిగిలుండగానే అఫ్గానిస్థాన్తో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. అఫ్గన్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్శర్మ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగినా…కొత్త కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే దుమ్మురేపే ఇన్నింగ్స్తో ఇండోర్లో బౌండరీల మోత మోగించారు. తొలుత అక్షర్పటేల్ స్పిన్ తంత్రంతో అఫ్గన్ 172 పరుగులకు పరిమితమైంది. నయీబ్ మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.
Team India | ఇండోర్: భారత్ దుమ్మురేపింది. అఫ్గానిస్థాన్తో ఆదివారం జరిగిన రెండో టీ20 పోరులో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో(26 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. అఫ్గన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే(32 బంతుల్లో 63 నాటౌట్, 5ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. ఓపెనర్ రోహిత్శర్మ(0) వరుసగా రెండో మ్యాచ్లో పరుగుల ఖాతా తెరువకుండానే సున్నాకు వెనుదిరిగాడు. దాదాపు 14 నెలల తర్వాత తిరిగి పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ(29) టచ్లోకి వచ్చాడు. కరీమ్ జనత్(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గులాబ్దిన్ నయీబ్(57) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, సహచర బ్యాటర్లు స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. ప్రత్యర్థి తన బౌలింగ్తో కట్టడి చేసిన అక్షర్ పటేల్(2/17)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మూడో మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరులో జరుగనుంది.
బ్యాటింగ్ ప్యారడైజ్గా పేరు గాంచిన ఇండోర్లో యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగారు. సీనియర్లు ఆకట్టుకోలేని చోట అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అఫ్గన్ బౌలర్లను ఊచకోత కోశారు. ఫజుల్లా ఫరుఖి వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మొదటి బంతినే ఫోర్గా మలిచిన జైస్వాల్ తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన ఈ ముంబై కుర్రాడు..అఫ్గన్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. రోహిత్శర్మ తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్బౌల్డ్గా వెనుదిరిగినా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా యశస్వి తన దూకుడు కనబరిచాడు. ఫారుఖిని మరోమారు లక్ష్యంగా చేసుకున్న జైస్వాల్ రెండు భారీ సిక్స్లతో అరుసుకున్నాడు. ఈ క్రమంలో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఈ యువ బ్యాటర్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.
ముజిబ్ వేసిన ఐదో ఓవర్లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు బాదితే..కోహ్లీ కండ్లు చెదిరే రీతిలో ఫోర్ కొట్టాడు. కుదురుకుంటున్న తరుణంలో నవీనుల్ హక్ బౌలింగ్లో కోహ్లీ బౌట్ కావడంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన శివమ్ దూబే..జైస్వాల్కు జత కలిశాడు. వీరిద్దరు అఫ్గన్ బౌలర్లను ఆడుకున్నారు. నబీ పదో ఓవర్లో దూబే మూడు భారీ సిక్స్లతో విరుచుకుపడితే తానేం తక్కువ కాదన్నట్లు చెలరేగిన జైస్వాల్ 27 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టేందుకు అఫ్గన్ కెప్టెన్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అయితే జనత్ బౌలింగ్లో షాట్ కోసం ప్రయత్నించినా..జైస్వాల్ కీపర్ క్యాచ్తో వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. జైస్వాల్ స్థానంలో క్రీజులోకొచ్చిన రింకూసింగ్(9 నాటౌట్)తో కలిసి దూబే గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో వరుసగా రెండో మ్యాచ్లో అర్ధసెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
12 అంతర్జాతీయ టీ20ల్లో భారత కెప్టెన్ రోహిత్శర్మ డకౌట్ల సంఖ్య. రోహిత్ తర్వాత చక్బవ, సౌమ్యసర్కార్(11), ఉమర్ అక్మల్, దిల్షాన్, శనక(10) ఉన్నారు.
15 జూన్ 2019 నుంచి భారత్ స్వదేశంలో 15టీ20 సిరీస్లు ఆడింది. ఇందులో 13 సిరీస్లు కైవసం చేసుకున్న
టీమ్ఇండియా రెండింటిని డ్రా చేసుకుంది.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 172 ఆలౌట్(గులాబ్దిన్ 57, జద్రాన్ 23, అర్ష్దీప్సింగ్ 3/32, అక్షర్పటేల్ 2/17),
భారత్: 15.4 ఓవర్లలో 173/4(జైస్వాల్ 68, దూబే 63 నాటౌట్, జనత్ 2/13, ఫారుఖి 1/28)