క్రీడాభిమానులకు ఒక రోజు ముందే దసరా పండుగ వచ్చేసింది. హిమాలయ పర్వతసానువుల్లో విరాట్ కోహ్లీ సింహనాదం దేశమంతా ప్రతిధ్వనించింది. ఐసీసీ టోర్నీల్లో కొరుకుడు పడని కొయ్యలా మారిన న్యూజిలాండ్పై భారత్ జయకేతనం ఎగురవేసింది.
ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లే ఉన్నారు.. భారత్కు కష్టమే!
పిచ్ కివీస్కు అనుకూలిస్తుంది.. టీమ్ఇండియా పనైపోయినట్లే!!
ఆల్రౌండర్లకు కొదవ లేని కివీస్ ముందు రోహిత్ సేన నిలుస్తుందా!!!
మ్యాచ్కు ముందు ఇలా సవాలక్ష సవాళ్లు.. వేలాది అనుమానాలు. కానీ వాటన్నీటికి టీమ్ఇండియా చెక్ పెట్టింది. ఈ సారి కప్పు కొట్టాల్సిందే అని దృఢంగా నిశ్చయించుకున్న రోహిత్సేన.. కివీస్పై ఆల్రౌండ్ ఆధిపత్యం కనబర్చింది. ప్రతిఘటనకు మారుపేరైన కివీస్.. భారత్పై వరల్డ్కప్లో అత్యధిక స్కోరు నమోదు చేస్తే.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో విజృంభించాడు. కష్టతరమైన లక్ష్యఛేదనలో రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో అదరిపోయే పునాది వేస్తే.. విరాట్ తనకు అలవాటైన రీతిలో ఇన్నింగ్స్కు ఇరుసులా నిలుస్తూ.. ఛేదనలో మరో అద్వితీయ విజయాన్ని దేశ ప్రజలకు అందించాడు. ఫలితంగా రెండు దశాబ్దాల తర్వాత ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్పై గెలుపు రుచి చూసిన భారత్.. మెగాటోర్నీలో ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ లేపింది. ఈ దెబ్బతో సెమీస్కు మరింత చేరువైన భారత్ వారం రోజుల విశ్రాంతి తర్వాత డిఫెండింగ్ చాంపియన్తో తలపడనుంది.
ఐసీసీ మెగాటోర్నీల్లో 20 ఏండ్ల తర్వాత న్యూజిలాండ్పై టీమ్ఇండియాకు ఇదే తొలి విజయం. చివరిసారిగా భారత జట్టు 2003 వన్డే ప్రపంచకప్లో కివీస్పై గెలిచింది.
వన్డే ప్రపంచకప్లో భారత్పై న్యూజిలాండ్కు ఇదే (273) అత్యధిక స్కోరు. ఇప్పటివరకు 1999లో చేసిన 253 పరుగులే అత్యధికం.
ప్రపంచకప్లో రెండుసార్లు 5 వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్గా మహమ్మద్ షమీ రికార్డుల్లోకెక్కాడు.
ధర్మశాల: సమిష్టి ప్రదర్శనతో కదంతొక్కుతున్న భారత క్రికెట్ జట్టు.. వన్డే ప్రపంచకప్లో వరుసగా ఐదో విజయం ఖాతాలో వేసుకొని పది పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్కు మరింత చేరువైంది. బౌలర్ల తిరుగులేని ప్రదర్శనకు బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆదివారం ధర్మశాలలో జరిగిన పోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తుచేసింది. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో న్యూజిలాండ్పై భారత్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
ఐదుగురు బౌలర్లే అందుబాటులో ఉండటంతో.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించగా.. నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిషెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీ నమోదు చేసుకోగా.. ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర (75; 6 ఫోర్లు, ఒక సిక్సర్) మరో కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు కాన్వే (0), విల్ యాంగ్ (17)తో పాటు కెప్టెన్ లాథమ్ (5), చాప్మన్ (6), శాంట్నర్ (1) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో మహమ్మద్ షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకోగా.. ఈ టోర్నీలో తొలిసారి భారీగా పరుగులు (73) ఇచ్చుకున్న కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తన విలువ చాటుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (26; 5 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (27), రవీంద్ర జడేజా (39 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. ఛేజింగ్లో తుదికంటా నిలిచిన విరాట్.. విజయానికి ఐదు పరుగుల దూరంలో ఔటవడం అభిమానులను బాధించగా.. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఐదు వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్గా నిలిచిన షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రకృతి సౌందర్యం పరంగా ధర్మశాల అత్యుత్తమ మైదానమైనా.. ఔట్ఫీల్డ్ మాత్రం ఈ మ్యాచ్లో భారత ప్లేయర్లను భయపెట్టింది. బౌండ్రీ వద్ద బంతిని ఆపేందుకు భారత ఆటగాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బంతిని ఆపే క్రమంలో కెప్టెన్ రోహిత్ చేతి వేలికి గాయం కాగా.. కాసేపు అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. బుమ్రా అయితే రెండు సార్లు డైవ్ వేయడానికి సంశయించి ప్రత్యర్థికి బౌండ్రీలు ఇచ్చుకున్నాడు. చివర్లో ఈ పరుగుల తేడా బాగా కనిపించింది. గతంలో ఇక్కడ మ్యాచ్ ఆడిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ కూడా ఔట్ఫీల్డ్ చెత్తగా ఉందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ప్లేయర్గా గిల్ చరిత్రకెక్కాడు. 38 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని దాటిన గిల్.. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషీమ్ ఆమ్లా (40 ఇన్నింగ్స్లు)ను వెనక్కి నెట్టాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బౌండ్రీ ద్వారా గిల్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ప్రపంచంలోనే అత్యంత సుందరమైన క్రికెట్ మైదానాల్లో ఒకటైన ధర్మశాలలో.. ఆదివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. టీమ్ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మైదానాన్ని పొగమంచు కప్పేసింది. ఫలితంగా ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. లక్ష్యఛేదనలో రోహిత్ సేన 15.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులపై ఉన్నప్పుడు ఒక్కసారిగా మైదానంలో తెల్లటి పొగమంచు పరుచుకుంది. దీంతో అంపైర్లు మ్యాచ్కు కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మ్యాచ్ తిరిగి యధావిధిగా సాగింది.
ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్లో ఓ సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. గత మ్యాచ్లో అసాధ్యం అనుకున్న బంతిని అమాంతం ఒడిసి పట్టిన జడ్డూ.. ఈ సారి తేలికైన క్యాచ్ను జారవిడిచాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రచిన్ రవీంద్ర కొట్టిన బంతిన బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద జడేజా అందుకోలేకపోయాడు. దీంతో మైదానంలో ఒక్కసారిగా నిశబ్దం ఆవరించింది. ఈ టోర్నీలో మిగిలిన అన్నీ జట్ల కంటే మెరుగైన క్యాచింగ్తో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా ఓవరాల్గా మూడు అవకాశాలను చేజార్చుకుంది. వికెట్ల వెనుక రాహుల్ ఓ క్యాచ్ వదిలేయగా.. బౌండ్రీ వద్ద బుమ్రా ఓ సులువైన క్యాచ్ను అందుకోవడంలో విఫలమయ్యాడు.
‘స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేకపోయినా.. న్యూజిలాండ్పై గెలిస్తేనే కప్పు కొట్టే అర్హత ఉన్నట్లు’ ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందు అందరి నోటా ఒకటే మాట! ఇందులో నిజం లేకపోలేదు. 2003 ప్రపంచకప్ తర్వాత కివీస్పై భారత జట్టు ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా గెలువలేకపోయింది. వన్డే, టీ20, టెస్టు ఇలా ఫార్మాట్తో సంబంధం లేకుండా.. న్యూజిలాండ్ జట్టు టీమ్ఇండియాపై పైచేయి కనబర్చింది. అలాంటి ఆధిపత్యానికి ఆదివారం రోహిత్ సేన గండికొట్టింది. కీలక మ్యాచ్ల్లో నేల చూపులు చూస్తారనే అపవాదును తుడిచిపెడుతూ.. బౌలింగ్, బ్యాటింగ్లో టీమ్ఇండియా దుమ్మురేపింది. గాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమై మ్యాచ్కు ముందే ఒకింత వెనుకడుగు వేసిన భారత్.. కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే అద్భుతం చేసింది.
ప్రత్యర్థి జట్టులో ఆల్రౌండర్లకు కొదవలేకున్నా.. పిచ్ కివీస్ ప్లేయర్లకు అనుకూలమైనదైనా.. అదరక బెదరక ఎదురు నిలిచింది. ఓపెనర్లు త్వరగానే ఔటైనా.. మిడిలార్డర్ పోరాటం కనబర్చడంతో ఒక దశలో 178/2తో పటిష్ట స్థితిలో నిలిచిన కివీస్ను అడ్డుకట్ట వేయడంలో మన బౌలర్లు సఫలీకృతమయ్యారు. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్లుగా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన.. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ తన విలువ చాటుకున్నాడు. వాయు వేగానికి తన అనుభవాన్ని జోడించిన షమీ.. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. జట్టును పోటీలో నిలిపాడు. రచిన్ రవీంద్ర వికెట్ తీసి టీమ్లో జోష్ నింపిన షమీ.. ఆ తర్వాత మిషెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిషెల్ వికెట్లు కూడా ఖాతాలో వేసుకొని పాంచ్ పటాకా మోగించాడు. ఇక కష్టతరమైన లక్ష్యఛేదనలో భారత్కు శుభారంభం దక్కినా.. ఆ తర్వాత మాత్రం గెలుపు కష్టమే అనిపించింది. అయినా ఆ దశలో నేనున్నానంటూ విరాట్ క్రీజులో పాతుకుపోయాడు.
నిన్న మొన్న వచ్చిన కుర్రాళ్లకు తనకు ఉన్న తేడా ఏంటో చూపిస్తూ.. బంతిని నేల మీద నుంచి కొడితే వచ్చే లాభం ఎలాంటిదో చూపాడు. కివీస్ బౌలర్లు జోరు కనబరుస్తున్నప్పుడు సంయమనం పాటించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలో తనను చేజ్ మాస్టర్ అని ఎందుకు అంటారో మరో కీలక ఇన్నింగ్స్తో చాటుకున్నాడు. పరుగు లేని చోట సింగిల్ తీసిన కోహ్లీ.. వికెట్ల మధ్య చిరుతలా పరిగెడుతూ.. ఒక్క పరుగు వచ్చే చోటు రెండు పరుగులు తీసి లక్ష్యాన్ని కరిగించుకుంటూపోయాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సహకారం అందించడంతో లక్ష్యఛేదన సాఫీగా సాగుతున్నట్లు అనిపించినా.. 9 పరుగుల తేడాలో రాహుల్తో పాటు సూర్యకుమార్ ఔట్ కావడంతో భారత విజయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందులోనూ సూర్య రనౌట్కు పరోక్షంగా కోహ్లీ కారణమయ్యాడని అనిపించడంతో అతడు మరింత బాధ్యతాయుతంగా ఆడాడు.
కివీస్ బౌలర్లు కుల్దీప్ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లతో విరుచుకుపడ్డట్లు.. భారత ఆటగాళ్లు కూడా ఫెర్గూసన్ను టార్గెట్ చేశారు. ఏమాత్రం అవకాశం దక్కినా.. వదలకుండా బౌండ్రీలతో అదరగొట్టారు. మరోసారి సెంచరీ అవకాశం కోహ్లీ ముంగిట నిలిచినా.. కీలక మ్యాచ్లో సొంత మైలురాళ్ల కన్నా జట్టు విజయమే ప్రధానమని భావించిన కోహ్లీ.. స్ట్రయిక్ రొటేషన్తో ముందుకు సాగాడు.. జట్టును విజయ తీరాలకు చేరువ చేసి వెనుదిరిగాడు. ఈ దెబ్బతో దేశ వ్యాప్తంగా అభిమానులకు ఒక రోజు ముందే విజయ దశమి సంబురాలు రుచిచూపిన విరాట్.. ప్రపంచకప్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు!
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 273 ఆలౌట్ (డారిల్ మిషెల్ 130, రచిన్ 75; షమీ 5/54; కుల్దీప్ 2/73), భారత్: 48 ఓవర్లలో 274/6 (కోహ్లీ 95, రోహిత్ 46; ఫెర్గూసన్ 2/63, శాంట్నర్ 1/37).