పారిస్: భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. ఆర్చరీ ప్రపంచకప్లో మరో స్వర్ణం చేజిక్కించుకుంది. పారిస్ వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ స్టేజ్-4లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్తో కూడిన భారత మహిళల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. శనివారం కాంపౌండ్ ఫైనల్లో భారత త్రయం 234-233తో మెక్సికో (ఆండ్రియా, ఆనా హెర్నాండెజ్, క్వింటెరో)పై గెలిచింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో మెక్సికో ఆర్చర్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. భారత త్రయం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాణాలు సంధించింది.
ఇక పురుషుల విభాగంలోనూ భారత జట్టుకు బంగారు పతకం లభించింది. అభిషేక్ వర్మ, ఓజాస్, ప్రథమేశ్తో కూడిన భారత జట్టు 236-232 తేడాతో అమెరికా (క్రిస్, జేమ్స్, సైయర్)పై విజయం సాధించింది. రికర్వ్ విభాగంలో భారత్కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్ ప్రభాకర్తో కూడిన పురుషుల జట్టుతో పాటు.. భజన్ కౌర్, అంకిత, సిమ్రన్జీత్తో కూడిన మహిళల జట్టు కాంస్యాలు గెలుచుకున్నాయి.