టీమ్ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ తొలి షో అదిరిపోయే హిట్ కొట్టింది. రాహుల్ ద్రవిడ్, రోహిత్శర్మ, కేఎల్ రాహుల్ నాయక త్రయం నేతృత్వంలో భారత్ బోణీ అదిరిపోయింది. టీ20 ప్రపంచకప్ పేలవ ప్రదర్శనను మరిపిస్తూ రన్నరప్ న్యూజిలాండ్పై రోహిత్సేన విజయదుందుభి మోగించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సిరీస్లో ముందంజ వేసింది. అశ్విన్, భువనేశ్వర్ రాణింపుతో కివీస్ను కట్టడి చేసిన భారత్..లక్ష్యఛేదనలో సూర్యకుమార్ అర్ధసెంచరీతో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై జరిగిన పోరులో టీమ్ఇండియాఅభిమానులకు పసందైనవిందు అందించింది.
జైపూర్: టీ20 మెగాటోర్నీలో తమకు ఎదురైన భారీ ఓటమికి న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమ్ఇండియా ఐదు వికెట్ల తేడాతో కివీస్పై ఘన విజయం సాధించింది. తొలుత అశ్విన్(2/23), భువనేశ్వర్(2/24) రాణింపుతో కివీస్ 20 ఓవర్లలో 164/6 స్కోరు చేసింది. మార్టిన్ గప్టిల్(70), మార్క్ చాప్మన్(63) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 166/5 పరుగులు నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 62, 6 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధసెంచరీతో అదరగొట్టాడు. బౌల్ట్ (2/31) రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలకమైన సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది.
సూర్య అదరహో: కివీస్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దిగిన భారత్కు మెరుగైన శుభారంభమే లభించింది. నాయక ద్వయం రోహిత్శర్మ(48), కేఎల్ రాహుల్(15) ఆది నుంచే కివీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ ముందుకు సాగారు. కుదురుకునేందుకు తొలి రెండు ఓవర్లు తీసుకున్న ఈ జోడీ మూడో ఓవర్ నుంచి పరుగుల వరద పారించింది. తాత్కాలిక కెప్టెన్ టిమ్ సౌథీని లక్ష్యంగా చేసుకుంటూ హిట్మ్యాన్ రోహిత్ రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్తో పదిహేను పరుగులు పిండుకున్నాడు. ఇదే జోరులో బౌల్ట్ను కూడా బాగానే అరుసుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు సిక్స్లు, రెండు ఫోర్లు బాది బౌల్ట్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. రోహిత్కు పోటీగా వద్దామనుకున్న రాహుల్..భారీ షాట్కు ప్రయత్నించి చాప్మన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సూర్యకుమార్ యాదవ్.. రోహిత్ జతగా చెలరేగాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి 56/1 స్కోరు చేసింది. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ లక్ష్యాన్ని అంతకంతకు కరిగించుకుంటూ పోయాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించడంతో కివీస్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. సాఫీగా సాగుతున్న తరుణంలో బౌల్ట్ బౌలింగ్లో రోహిత్ వెనుదిరిగాడు. అయినా సూర్యకుమార్ తన జోరు తగ్గించలేదు. పంత్(17 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపిస్తూ సిక్సర్తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో సూర్యకుమార్ రివర్స్ స్పీప్షాట్తో క్లీన్బౌల్డ్ అయ్యాడు. శ్రేయాస్(5), వెంకటేశ్(4) వెంటవెంటనే వెనుదిరిగినా..ఆఖర్లో అక్షర్పటేల్(1 నాటౌట్)తో కలిసి పంత్ జట్టును గెలిపించాడు. కోచ్గా వచ్చిన ద్రవిడ్కు తొలి మ్యాచ్లోనే భారత్ ఘనవిజయంతో స్వాగతం పలికింది.
టాస్ కోల్పోయి బ్యాటింగ్కు దిగిన కివీస్కు తొలి ఓవర్లోనే మిచెల్(0)రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే గప్టిల్, అరంగేట్రం ప్లేయర్ చాప్మన్ సమయోచిత ఇన్నింగ్స్తో ఇన్నింగ్స్ను గాడిలో పడేశారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చాప్మన్ ఔట్ తర్వాత మిగిలిన వారు విఫలం కావడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. అశ్విన్, భువీ..కివీస్ బ్యాటర్లను నియంత్రించడంలో విఫలమయ్యారు.
న్యూజిలాండ్: గప్టిల్(సి)అయ్యర్(బి)చాహర్ 70, మిచెల్(బి)భువనేశ్వర్ 0, చాప్మన్(బి) అశ్విన్ 63, ఫిలిప్స్(ఎల్బీ)అశ్విన్ 0, సిఫెర్ట్(సి)సూర్యకుమార్(బి)భువనేశ్వర్ 12, రచిన్(బి) సిరాజ్ 7, సాంట్నర్ 4 నాటౌట్, సౌథీ 0 నాటౌట్; ఎక్స్ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 164/6; వికెట్ల పతనం: 1-1, 2-110, 3-110, 4-150, 5-153, 6-162; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-24-2, చాహర్ 4-0-42-1, సిరాజ్ 4-0-39-1, అశ్విన్ 4-0-23-2, అక్షర్పటేల్ 4-0-31-0.
భారత్: రాహుల్(సి)చాప్మన్(బి)సాంట్నర్ 15, రోహిత్శర్మ(సి)రవింద్ర(బి)బౌల్ట్ 48, సూర్యకుమార్యాదవ్(బి)బౌల్ట్ 62, పంత్ 17 నాటౌట్, అయ్యర్(సి)బౌల్ట్(బి)సౌథీ 5, వెంకటేశ్ (సి)రవీంద్ర(బి)మిచెల్ 4, అక్షర్పటేల్ 1 నాటౌట్; ఎక్స్ట్రాలు: 14; మొత్తం: 19.4 ఓవర్లలో 166/5; వికెట్ల పతనం: 1-50, 2-109, 3-144, 4-155, 5-160; బౌలింగ్: 4-0-40-1, బౌల్ట్ 4-0-31-2, ఫెర్గుసన్ 4-0-24-0, సాంట్నర్ 4-0-19-1, అస్టిల్ 3-0-34-0, మిచెల్ 0.4-0-11-1.