సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లతో నిండిన భారత జట్టు కంగారూలపై పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి మ్యాచ్లో యంగ్ఇండియా అదరగొట్టింది. సహచరులు విఫలమైన చోట శ్రేయస్ అయ్యర్ అర్ధశతకంతో సత్తాచాటి జట్టుకు పోరాడే స్కోరు అందించగా.. బౌలింగ్లో ముఖేశ్ కుమార్ దుమ్మురేపాడు. ఛేదనలో ఆసీస్ తుదికంటా పోరాడినా.. స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కంగారూలను కట్టడి చేశారు.
బెంగళూరు: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండు వారాలు తిరిగేసరికి అదే కంగారూలపై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందే కప్పు ఖాతాలో వేసుకున్న భారత్.. ఆదివారం జరిగిన చివరి పోరులో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అక్షర్ పటేల్ (31), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) పర్వాలేదనిపించారు. రుతురాజ్ గైక్వాడ్ (10), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5), రింకూసింగ్ (6) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెహ్రాన్డార్ఫ్, బెన్ డ్వార్షే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. మెక్ డర్మాట్ (54; 5 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. ట్రావిస్ హెడ్ (28), కెప్టెన్ మాథ్యూ వేడ్ (22) పోరాడారు. జోస్ ఇంగ్లిస్ (4), అరోన్ హార్డీ (6) విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3, అర్ష్దీప్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్లో 31 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తీసిన అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. సిరీస్ ఆసాంతం రాణించి 9 వికెట్లు తీసిన యువ స్పిన్నర్ రవికి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డు దక్కింది.
19 అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇది 19వ విజయం. ఒక ప్రత్యర్థిపై టీమ్ఇండియాకు ఇదే అత్యధికం.
1 భారత్ తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక (9) వికెట్లు తీసిన బౌలర్గా రవి బిష్ణోయ్.. అశ్విన్ సరసన చేరాడు.
భారత్: 160/8 (శ్రేయస్ 53, అక్షర్ 31; బెహ్రాన్డార్ఫ్ 2/38),
ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 154/8 (మెక్డర్మాట్ 54; ముఖేశ్ 3/32).