న్యూఢిల్లీ: ఈసారి పారాలింపిక్స్లో భారత్ సుమారు 5 స్వర్ణాలతో పాటు మొత్తం 15 పతకాలు సాధిస్తుందని చెఫ్ డీ మిషన్ గురుశరణ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేనంతగా టోక్యో పారాలింపిక్స్కు 54 మంది ఆటగాళ్లు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే విషయమై గురుశరణ్ శుక్రవారం స్పందిస్తూ.. ‘ఈ పారాలింపిక్స్లో మనకు ఎక్కువ పతకాలు వస్తాయని ఆశిస్తున్నా. విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు కొన్నాళ్లుగా మన పారా అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలో జరుగబోయే ఈ పోటీల్లో కనీసం ఐదు స్వర్ణాలతో పాటు 15 పతకాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఈనెల 24 నుంచి జరిగే పారాలింపిక్స్లో తొమ్మిది క్రీడాంశాల్లో పోటీ పడుతున్న భారత పారా అథ్లెట్ల బృందం ఇప్పటికే టోక్యోకు బయల్దేరి వెళ్లింది.