ఈ ఏడాది భారత్లో జరిగే చెస్ ఒలింపియాడ్లో కచ్చితంగా మన దేశం మెడల్ సాధిస్తుందని దేశపు తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. భారత యువకులు చెస్ లెగసీని ముందుకు తీసుకెళ్తారని తను ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది జరిగే ప్రపంచ చెస్ ఒలింపియాడ్ తమిళనాడులోని మహాబలిపురంలో జరగనుంది.
ఒలింపిక్స్కు టార్చ్ ఉన్నట్లే ఈ ఏడాది నుంచి చెస్ ఒలింపియాడ్కు కూడా టార్చ్ రిలే ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడే నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఈ టార్చ్ రిలేను చెస్ పుట్టినిల్లు భారత్లో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మొట్టమొదటి చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో దీన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత మొత్తం 75 పట్టణాలు తిరిగిన తర్వాత ఆ టార్చ్.. ఒలింపియాడ్ జరిగే మహాబలిపురం చేరుతుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఆలిండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) విడుదల చేసింది.
ఈ క్రమంలోనే మాట్లాడిన విశ్వనాథన్ ఆనంద్.. ‘‘దీని గురించి నేను చాలా ఎగ్జయిటింగ్గా ఎదురు చూస్తున్నా. దాదాపు 2 వేల మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటారు. మన ఆటగాళ్లకు నేను మెంటార్గా ఉండబోతున్నా. ఈసారి మన జట్టు మెడల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు. ప్రజ్ఞానంద వంటి ఆటగాళ్లను చూస్తుంటే భారత్లో చెస్ భవితవ్యంపై తనకు బెంగ లేకుండా పోతోందని ఈ లెజెండరీ ప్లేయర్ కొనియాడాడు.