సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియాకు.. వన్డే సిరీస్లోనూ నిరాశే ఎదురైంది. తొలి రెండు మ్యాచ్ల్లో పరాజయాల వైపు నిలిచిన రాహుల్ సేన.. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి పోరులోనూ ఓటమి పాలైంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్తో పాటు చివర్లో దీపక్ చాహర్ అర్ధశతకాలతో మెరిసినా.. ఫలితం లేకపోయింది. పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా వరుసగా మూడో గెలుపుతో టీమ్ఇండియాను వైట్వాష్ చేసింది.
కేప్టౌన్: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరకు టీమ్ఇండియా పరాజయం వైపు నిలిచింది. లక్ష్యఛేదనలో 18 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో భారత జట్టు ఆఖరి మూడు వికెట్లు కోల్పోయింది. భారీ అంచనాలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా బవుమా సేన 3-0తో సిరీస్ను వైట్వాష్ చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ (130 బంతుల్లో 124; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. డసెన్ (52), మిల్లర్ (39) రాణించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (65; 5 ఫోర్లు), శిఖర్ ధవన్ (61; 5 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ చాహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించినా ఫలితం లేకపోయింది. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ, ఫెలుక్వాయో చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్లో ఒక్కటంటే ఒక్క విజయం లేకుండానే ఇంటిదారి పట్టింది. డికాక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 49.5 ఓవర్లలో 287 ఆలౌట్ (డికాక్ 124, డసెన్ 52; ప్రసిద్ధ్ కృష్ణ 3/59, బుమ్రా 2/52), భారత్: 49.2 ఓవర్లలో 283 ఆలౌట్ (కోహ్లీ 65, ధవన్ 61, దీపక్ 54; ఎంగ్డీ 3/58, ఫెలుక్వాయో 3/40).