IND vs WI : వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)లో కనీస సౌకర్యాల లేమిపై రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒకవైపు టీమిండియా(Team India) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కరీబియన్ బోర్డు(West Indies Cricket Board) ఈ పర్యటన కోసం కనీస ఏర్పాట్లు కూడా చేసినట్లు కనిపించడం లేదు. ఇక మూడో టీ20 మ్యాచ్కు ముందు జరిగిన విషయం మరింత చర్చనీయాంశమైంది. టాస్ ఓడిన భారత జట్టు ఫీల్డింగ్ కోసం మైదానంలో అడుగుపెట్టింది. కెప్టెన్ స్పీచ్ అనంతరం ఆటగాళ్లంతా ఎవరికి నిర్దేశించిన స్థానానికి వారు చేరుకున్నారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభమైతుందనుకుంటే.. అంపైర్లు ఆటగాళ్లను వెనక్కి పిలిచారు.
అసలు విషయం ఏంటీ? అని పరిశీలిస్తే.. మైదానంలో 30 యార్డ్స్ వలయం(30 Yards Circle) మార్కింగ్ చేయలేదు. దీంతో పాండ్యా సేన తిరిగి డగౌట్ చేరగానే సిబ్బంది ఆ ఏర్పాట్లు చేశారు. దీంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా.. విండీస్ క్రికెట్ బోర్డు చేసిన ఏర్పాట్లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ అభివృద్ధి సాధ్యం కావాలంటే ముందు మౌలిక సదుపాయాలను కల్పించాలని, భారత్ వంటి జట్టుతో సిరీస్ ఆడితే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అనుకుంటే సరిపోదని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేయాలని అంటున్నారు.
ఇప్పటికే విండీస్ టూర్లో ఏర్పాట్లపై భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)తో పాటు సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విలాసవంతమైన సౌకర్యాలు లేకున్నా, కనీస స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయలేదని పాండ్యా వెల్లడించాడు. పిచ్పై పచ్చిక లేదని, నెట్స్ కూడా పాతవే అని అశ్విన్ వ్యాఖ్యానించాడు. ప్రాక్టీస్ చేసేందుకు కూడా సరైన సదుపాయాలు కల్పించలేక విండీస్ బోర్డు విఫలమైందని అన్నాడు.