IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య పొట్టి సిరీస్(T20 Series)కు రేపటితో తెరలేవనుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా రేపు మొదటి మ్యాచ్ బ్రియాన్ లారా స్టేడియం(Brian Lara Stadium)లో జరుగనుంది. యువకులతో నిండిన భారత జట్టుకు హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్ స్టార్స్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswa), తిలక్ వర్మ(Tilak Varma)తో పాటు పేసర్ ముకేశ్ కుమార్(Mukesh Kumar) పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
కరీబియన్ గడ్డపై టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన యశస్వీ జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. రెండు హాఫ్ సెంచరీలు, సెంచరీతో కదం తొక్కాడు. సూపర్ ఫామ్లో ఉన్న యశస్వీ తనకెంతో ఇష్టమైన టీ20ల్లోనూ ఓపెనర్గా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మిడిలార్డర్లో తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
ఆరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన యశస్వీ
ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్లో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ టీ20ల్లో జోరు కొనసాగించాలని అనుకుంటున్నాడు. అయితే.. వన్డే సిరీస్లో ప్రయోగాలు చేసిన టీమిండియా మేనేజ్మెంట్ టీ20ల్లో అదే పంథా అనురిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత తుది జట్టు అంచనా : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమర్.
పేసర్ ముకేశ్ కుమార్
టెస్టు సిరీస్లో విండీస్ను చిత్తు చేసిన భారత్ అదే ఊపులో వన్డే సిరీస్ కూడా కైవసం చేసకుంది. పాండ్యా కెప్టెన్సీలో యువ భారత్ మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దాంతో, ముచ్చటగా మూడో ట్రీఫీ కూడా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే.. టీ20ల్లో రెండు సార్లు చాంపియన్గా విండీస్కు ఘనమైన రికార్డు ఉంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ తప్పకపోవచ్చు.