సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొట్టాడు. వెన్ను గాయం కారణంగా ఆటకు దూరమైన బుమ్రా.. 11 నెలల తర్వాత ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తూనే.. తన బౌలింగ్తో జట్టును ముందుండి నడిపించాడు. నిలకడగా గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేస్తూ ఆకట్టుకున్నాడు. మిగిలిన బౌలర్లు కూడా తలో చేయి వేయడంతో ఐర్లాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కాగా.. ఛేదనలో వరుణుడు మ్యాచ్కు ఆటంకం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టీమ్ఇండియా విజయం సాధించింది.
డబ్లిన్: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా.. ఐర్లాండ్ పర్యటనలో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బారీ మెక్కార్టీ (33 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. కార్టీస్ కాంఫర్ (39; 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్ఇండియా 6.5 ఓవర్లలో 47/2తో ఉన్న సమయంలో మ్యాచ్కు వర్షం అడ్డుపడింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ గైక్వాడ్ (19 నాటౌట్) పర్వాలేదనిపించారు. వరుణుడు శాంతించకపోవడంతో డక్వర్త్ ప్రకారం విజేతను నిర్ణయించారు. బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడే రెండో టీ20 జరగనుంది.
టీమ్ఇండియా సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఐర్లాండ్తో సిరీస్పై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. బుమ్రా పునరాగమనం కోసం భారత అభిమానులు ఈ మ్యాచ్పై ఆసక్తి కనబర్చారు. అంచనాలకు అనుగుణంగా బుమ్రా కమ్బ్యాక్ చేయడంతో టీమ్ మేనేజ్మెంట్కు భారీ ఉపశమనం లభించినైట్లెంది. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలకు ముందు బుమ్రా దుమ్మురేపాడు. పొట్టి ఫార్మాట్లో భారత 11వ సారథిగా తొలి ఓవర్ వేసిన బుమ్రా మొదటి బంతికి బౌండ్రీ సమర్పించుకున్నా.. రెండో బంతికే వికెట్ పడగొట్టాడు. అదే ఓవర్లో ఐదో బంతికి మరో వికెట్ ఖాతాలో వేసుకున్న బుమ్రా.. తన బౌలింగ్లో వాడి తగ్గలేదని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు పడగొట్టగా.. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక దశలో ఐర్లాండ్ 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మన బౌలర్ల జోరు చూస్తుంటే.. ఐర్లాండ్ వంద పరుగులైనా చేస్తుందా అనుకుంటే.. మెక్కార్టీ, కాంఫర్ రాణించడంతో పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఇక ఛేదనలో జైస్వాల్, గైక్వాడ్ ధాటిగా ఆడటంతో టీమ్ఇండియాకు శుభారంభం లభించింది. తొలి వికెట్కు 46 పరుగులు జోడించిన అనంతరం జైస్వాల్ ఔట్ కాగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ (0) తొలి బంతికే ఔటయ్యాడు. ఈ దశలో మ్యాచ్కు వర్షం అడ్డుపడగా.. డక్వర్త్ ప్రకారం లక్ష్యానికి (45 పరుగులు) భారత్ రెండు పరుగుల ముందుండటంతో బుమ్రా సేనను విజేతగా ప్రకటించారు.
ఐర్లాండ్: 139/7 (మెక్కార్టీ 51 నాటౌట్, కాంఫర్ 39; బుమ్రా 2/24, రవి బిష్ణోయ్ 2/23),
భారత్: 6.5 ఓవర్లలో 47/2 (జైస్వాల్ 24, గైక్వాడ్ 19 నాటౌట్; క్రిగ్ యాంగ్ 2/2).