ఢాకా: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. కాసేపు బౌలర్లది పైచేయి అయితే.. మరి కాసేపు బ్యాటర్లది పైచేయి అన్నట్లు మ్యాచ్ జరుగుతున్నది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. ఆరంభంలో పరుగులు రాబట్టడానికి తడబడింది. బంగ్లా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత టాప్ ఆర్డర్ను ఉక్కిరి బిక్కిరి చేశారు.
దాంతో స్కిప్పర్ శిఖర్ ధవన్ (7) ఆరో ఓవర్లలోనే జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో షకీబ్ అల్ హసన్ మూడు బంతుల వ్యవధిలో వెంటవెంటనే రోహిత్శర్మ (27), విరాట్ కోహ్లీ (9) వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నిదానంగా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అయితే, 20వ ఓవర్ ఆఖరి బంతికి ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్లో అయ్యర్ (24) కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. కేఎల్ రాహుల్కు జత కలిశారు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో 32వ ఓవర్ ఐదో బంతికి కేఎల్ రాహుల్ బౌండరీ ద్వారా తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 152/4 వికెట్లుగా ఉంది.