ఢాకా: బంగ్లాదేశ్ టూర్లో ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. ఇవాళ తొలి వన్డేలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. దాంతో 11వ ఓవర్ ముగిసేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
మధ్యలో కేఎల్ రాహుల్ వికెట్ల పతనాన్ని కొంతసేపు నిలువరించినా 20వ ఓవర్ ఆఖరి బంతికి ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్లో అయ్యర్ (24) కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. కేఎల్ రాహుల్కు జత కలిశాడు. ఇద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో 32వ ఓవర్ ఐదో బంతికి కేఎల్ రాహుల్ బౌండరీ ద్వారా తన హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే వాషింగ్టన్ సుందర్ (19) షకీబ్ అల్ హసన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
దాంతో మరోసారి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. సుందర్ తర్వాత వెంటవెంటనే షాబాజ్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఇలా వచ్చి అలా పెవిలియన్ బాటపట్టారు. షాబాజ్.. ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్లో డకౌట్ కాగా, శార్ధూల్ (2) షకీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దీపక్ చాహర్ కూడా పరుగులేమీ చేయకుండానే షకీబ్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
దాంతో 34.4 ఓవర్లలో భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలింది. ఈ పరిస్థితుల్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లు బ్యాటింగ్ చేయగలుతుందా అనేది సందేహాస్పదంగానే ఉంది. అయితే, హాఫ్ సెంచరీ చేసి ఊపు మీదున్న కేఎల్ రాహుల్ ఇంకా క్రీజులోనే ఉండటం భారత్కు ఊరటనిచ్చే అంశం.