ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మూడు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ షేర్ ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ పరుగులు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. బంగ్లా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.
దాంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. అయినా స్కిప్పర్ శిఖర్ ధవన్ (7) ఆరో ఓవర్లలోనే జట్టు స్కోరు 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో షకీబ్ అల్ హసన్ మూడు బంతుల వ్యవధిలో వెంటవెంటనే రోహిత్శర్మ (27), విరాట్ కోహ్లీ (9) వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కోలుకోలేని దెబ్బతీశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ నిదానంగా ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా 20వ ఓవర్ ఆఖరి బంతికి ఎబాదత్ హొస్సేన్ బౌలింగ్లో అయ్యర్ (24) కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్.. కేఎల్ రాహుల్కు జతగా క్రీజులోకి వచ్చాడు. 23వ ఓవర్ ఐదో బంతికి షకీబ్ బౌలింగ్లో సుందర్ ఒక పరుగు చేయడం ద్వారా జట్టు స్కోరు 100 పరుగుల మైలురాయిని దాటింది.