చిన్న పామునైనా.. పెద్ద కర్రతో కొట్టాలంటారు. ప్రత్యర్థి ఎంత బలహీన జైట్టెనా.. మన బలాన్నంతా వినియోగిస్తేనే విజయం మజానిస్తుంది. బంగ్లా పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా.. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం నుంచి మొదటి పోరు ప్రారంభం కానుండగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. ఈ ఫార్మాట్లో చివరి సారిగా మూడేండ్ల క్రితం బంగ్లాదేశ్పైనే సెంచరీ కొట్టిన కోహ్లీ సేమ్ సీన్ రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు!
చటోగ్రామ్: పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పడుతూ లేస్తూ సాగుతున్న టీమ్ఇండియా.. సంప్రదాయ క్రికెట్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత్ మరో ఆరు టెస్టులు మాత్రమే ఆడనుండగా.. ఈ ఆరింట్లో విజయాలు సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం బంగ్లాతో ప్రారంభం కానున్న తొలి టెస్టులో బోణీ కొట్టేందుకు రెడీ అయింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు బుమ్రా, షమీ, జడేజా గైర్హాజరీలో జట్టు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.
కేఎల్ రాహుల్ నాయకత్వానికి ఈ మ్యాచ్ పరీక్ష కానుండగా.. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్పై అందరి చూపు నిలువనుంది. గాయపడ్డ రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్కు అవకాశం దక్కుతుందా.. లేక బంగ్లా-‘ఏ’తో అనధికారిక టెస్టు సిరీస్లో రెండు భారీ సెంచరీలు బాదిన అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేస్తాడా అనేది ఆసక్తికరం.
పుష్కర కాలం తర్వాత జట్టులోకి వచ్చిన జైదేవ్ ఉనాద్కట్ వీసా కారణాలతో బంగ్లాదేశ్కు చేరుకోలేకపోగా.. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్తో పాటు ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా.. పిచ్ పరిస్థితులను బట్టి ఐదో బౌలర్ను ఎంపిక చేయనున్నారు. మరోవైపు షకీబ్, ముష్ఫికర్, లిటన్దాస్, నజ్ముల్, జాకిర్, మహ్మూదుల్ హసన్, నూరుల్, మెహదీ హసన్ మిరాజ్తో బంగ్లా కూడా బలంగానే ఉంది.