ముల్లాన్పూర్: క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పోరు సిద్ధమైంది. మండువేసవిలో దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ హోరులో మునిగితేలిన ఫ్యాన్స్కు సంప్రదాయక టెస్టు సమరం మజాను అందించనుంది. ఐపీఎల్ ముగిసిన ఆరు రోజుల వ్యవధిలోనే భారత్, ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య శనివారం నుంచి ఏకైక టెస్టు పోరుకు తెరలేవనుంది. చివరిసారి గత నవంబర్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడ్డ టీమ్ఇండియా మళ్లీ ఇన్ని రోజులకు ఆఫ్గన్తో టెస్టు మ్యాచ్కు సిద్ధమైంది. గత వారం ఐపీఎల్ సందడితో కనిపించిన ముల్లాన్పూర్ స్టేడియం తొలిసారి టెస్టుకు ఆతిథ్యమివ్వబోతున్నది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో ఈ మ్యాచ్ భాగం కాకపోయినా ఇరు జట్లు సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాయి. యువ బ్యాటర్ శుభ్మన్గిల్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగుతుంటే..హష్మతుల్లా షాహిది..ఆఫ్గన్ టీమ్ను ముందుకు నడిపించనున్నాడు.
దిగ్గజ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ రిటైర్మెంట్ తర్వాత కొత్త రూపు సంతరించుకున్న టెస్టు టీమ్ యువకులతో కళకళలాడుతున్నది. అయితే ఐపీఎల్ ద్వారా పొట్టి ఫార్మాట్లో బిజీగా గడిపిన క్రికెటర్లు ఇప్పుడు ఎర్రబంతితో పోటీకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టెస్టు జట్టుకు ఎంపికైన 15 మందిలో ఎనిమిది మంది సంప్రదాయక పోరుకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా 40 డిగ్రీల ఎండకాచే ముల్లాన్పూర్లో ప్రతిభ చాటేందుకు నెట్స్లో చెమటోడ్చారు. ఇదిలా ఉంటే 2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆఫ్గానిస్థాన్ టీమ్కు ఇది 13 మ్యాచ్ కాగా స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్ లేకుండానే పోటీకి దిగనుంది. మొత్తంగా రాబోయే సీజన్కు ఆరంభంగా భావిస్తున్న ఆఫ్గన్ టెస్టు మ్యాచ్ను తమ తేలికగా తీసుకోవడం లేదని టీమ్ఇండియా చీఫ్ కోచ్ గంభీర్ స్పష్టం చేసిన నేపథ్యంలో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొన్నది.
ఆఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు టీమ్ఇండియా పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతున్నది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ప్రయోగాలు చేస్తూనే ఉంది. గత ఇంగ్లండ్ పర్యటనలో సాయిసుదర్శన్, కరణ్నాయర్ లాంటి బ్యాటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం కల్పించింది. కీలకమైన మూడో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొనగా..ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన సాయిసుదర్శన్ వైపు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నది. లీగ్లో 700కు పైగా పరుగులు చేసిన సుదర్శన్ నిలకడ కనబరుస్తుండగా, ఇదే బెర్తు కోసం దేవదత్ పడిక్కల్ నుంచి పోటీ ఉంది. అయితే మూడులో సుదర్శన్ బ్యాటింగ్కు వస్తాడని గంభీర్ స్పష్టతనిచ్చిన నేపథ్యంలో పడిక్కల్కు నిరాశే ఎదురుకానుంది. బౌలింగ్ విషయానికొస్తే స్పిన్ దళానికి కుల్దీప్యాదవ్ నాయకత్వం వహించనుండగా, స్పిన్ ఆల్రౌండర్ కోటాలో సుందర్ జట్టులోకి రానున్నాడు. మూడో స్థానం కోసం దేశవాళీలో రాణించిన హర్ష్ దూబే, మానవ్ సుతార్లో ఒకరికి చాన్స్ దక్కనుంది. మహమ్మద్ సిరాజ్కు జతగా ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
స్టార్ బ్యాటర్ రెహ్మత్షాపై ఆఫ్గానిస్థాన్ భారీ ఆశలు పెట్టుకుంది. ఆఫ్గన్ తరఫున టెస్టుల్లో రెహ్మత్షా అత్యధిక పరుగులతో కొనసాగుతున్నాడు. దీనికి తోడు టెస్టుల్లో ఎక్కువ సెంచరీలకు తోడు 50 పరుగులకు పైగా చేయడం ద్వారా రెహ్మత్..ఆఫ్గన్కు కీలకంగా మారాడు. జట్టు బ్యాటింగ్కు వెన్నెముకగా భావిస్తున్న షా రాణించడంపైనే ఆఫ్గన్ గెలుపు, ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ గైర్హాజరీ నేపథ్యంలో షా రాణించడంపై జట్టు స్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. షాకు తోడు కెప్టెన్ హష్మతుల్లా షాహిది నిలదొక్కుకుంటే జట్టు బ్యాటింగ్ కష్టాలు తీరినట్లే.
157 టెస్టుల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు గిల్కు కావాల్సిన పరుగులు
50 వికెట్కీపర్, బ్యాటర్ పంత్కు ఇది 50వ టెస్టు మ్యాచ్. భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన కీపర్లలో ధోనీ(90), కిర్మాణి(88) ముందంజలో ఉన్నారు.
భారత్: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, గిల్(కెప్టెన్), పంత్, జురెల్, సుందర్, దూబే-సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆఫ్గానిస్థాన్: సెదికుల్లా అటల్, రెహ్మనుల్లా గుర్బాజ్, రెహ్మత్షా, షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్,రెహ్మనుల్లా, జజాయ్, అషఫ్,్ర కరొతె, క్వాయిస్ అహ్మద్, జియావుర్ రెహమాన్