కొలంబో: టెస్టు సిరీస్ కోసం టీమిండియా జట్టు శ్రీలంక(India Vs Sri Lanka)లో పర్యటించనున్నది. ఆగస్టు 15 నుంచి 27వ తేదీ మధ్య ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. గాలేలో తొలి టెస్టు, కొలంబోలో రెండో టెస్టును వేదికగా ఫిక్స్ చేశారు. ఆగస్టు 15వ తేదీన గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభంకానున్నది. ఆగస్టు 23వ తేదీ నుంచి కొలంబో స్టేడియంలో రెండో టెస్టు ఆడనున్నారు.
గతంలో రెండు సార్లు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్స్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ టైటిల్ను ఇండియా గెలవలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ రేసులో టీమిండియా జట్టు అయిదో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. ఇక నవంబర్-డిసెంబర్ నెలల్లో న్యూజిలాండ్లోనూ ఇండియా పర్యటించనున్నది. శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఇంగ్లండ్తో సిరీస్ను 2-2 తేడాతో డ్రా చేసుకున్నది. వెస్టిండీస్తో జరిగిన హోం సిరీస్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది స్వదేశీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ ఘోర పరాభవాన్ని చవిచూసింది.
2017లో చివరిసారి శ్రీలంకలో భారత్ పర్యటించింది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత లంకలో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనున్నది. గత సిరీస్ను భారత్ 3-0 తేడాతో గెలుచుకున్నది.