న్యూఢిల్లీ: ఇండియా మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు వేదిక కానుంది. ఈ మెగా టోర్నీని 2026లో ఇండియాలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. తొలిసారి 2009లో హైదరాబాద్ వేదికగా ఈ చాంపియన్షిప్ జరిగింది. నిజానికి ఇప్పుడు ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. 2023లో ఇండియా సుదిర్మన్ కప్ను నిర్వహించాల్సి వచ్చింది. అయితే దానిని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చైనాకు తరలించింది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన సుదిర్మన్ కప్ను కరోనా కారణంగా ఫిన్లాండ్కు తరలించారు.
సుదిర్మన్ కప్ ఆతిథ్యాన్ని కోల్పోయిన ఇండియా 2026లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ నిర్వహణకు అంగీకరించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించడం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, దేశానికి గర్వకారణమని బీఏఐ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన బీడబ్ల్యూఎఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వుమెన్స్ సింగిల్స్లో హైదరాబాదీ పీవీ సింధు వరల్డ్ చాంపియన్గా ఉంది.