బీజింగ్: ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సమావేశాలను 2023లో ఇండియాలో నిర్వహించనున్నారు. ఆ సమావేశాలను నిర్వహణ హక్కులను ఇండియా గెలుచుకున్నది. బీజింగ్లో జరిగిన సమావేశంలో భారత బృందం పాల్గొన్నది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత షూటర్ అభినవ్ బింద్రా, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ, ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా, క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ 139వ ఐఓసీ సెషన్లో పాల్గొన్నారు. ఒలింపిక్ కమిటీ సమావేశాల నిర్వహణ హక్కులను ఇండియా గెలుచుకోవడం ఇది రెండవ సారి. 1983లో ఢిల్లీలో ఓసారి ఐఓవీ సమావేశాలు జరిగాయి. ముంబైలో ఐఓసీ సెషన్ నిర్వహణ కోసం అవకాశం ఇచ్చినందుకు నీతా అంబానీ ధన్యవాదాలు తెలిపారు. భారత ఒలింపిక్ ఆశలను ఐఓసీ సమావేశం మరింత పురిగొల్పుతుందన్నారు. కోట్లాది మందికి క్రీడలు ప్రేరణగా నిలుస్తాయని ఆమె అన్నారు. ఐఓసీ సభ్యులు ఐఓసీ సెషన్ సమావేశాల్లో పాల్గొంటారు. ఐఓసీలో ఇదే అత్యున్నత శాఖ. ఇది తీసుకునే నిర్ణయాలే ఫైనల్. ఐఓసీలో మొత్తం 101 మంది సభ్యులు ఉన్నారు. అదనంగా మరో 45 మంది గౌరవ సభ్యులు ఉంటారు. ఐఓసీ సెషన్లో 50 అంతర్జాతీయ క్రీడా సంఘాలు కూడా పాల్గొంటాయి.