భారత బ్యాటర్లు దుమ్మురేపిన చోట.. కరీబియన్లు కనీస ప్రతిఘటన చూపలేకపోయారు. మనవాళ్లు బంతి వేయడం విండీస్ ప్లేయర్లు వికెట్ల ముందు దొరికిపోవడం రెండో ఇన్నింగ్స్లో ఇదే తంతు సాగింది. ఫలితంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో టీమ్ఇండియా.. ఇన్నింగ్స్ విజయం ఖాతాలో వేసుకుని ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సర్కిల్లో ఘనంగా బోణీ కొట్టింది.
ప్రత్యర్థి జట్టులో చివరి వికెట్ పడగొట్టి భారత విజయాన్ని ఖాయం చేయడం అశ్విన్కిది 23వసారి. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం. ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ (22) రెండో స్థానంలో ఉన్నాడు.
అరంగేట్రం టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఎనిమిదో భారత ఆటగాడిగా యశస్వి నిలిచాడు. గతంలో శ్రేయస్, పృథ్వీషా, రోహిత్, ధవన్, అశ్విన్, ఆర్పీ సింగ్, ప్రవీణ్ ఆమ్రే కూడా ఈ ఘనత దక్కించుకున్నారు.
ఒక మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన చేయడం అశ్విన్కిది ఎనిమిదోసారి. భారత్ తరఫున అగ్రస్థానంలో ఉన్న కుంబ్లేను అశ్విన్ సమం చేశాడు.
డొమినికా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (7/71) ధాటికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఆలౌటైంది. అలిక్ అథనాజె (28) టాప్ స్కోరర్గా నిలిచాడు. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ జట్టు.. స్కూల్ టీమ్ను తలపించింది. మనవాళ్లు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన చోట.. కరీబియన్లు కనీసం నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 421/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 20 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 150,
భారత్ తొలి ఇన్నింగ్స్: 421/5 డిక్లేర్డ్;
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: 130 (అథనాజె 28; అశ్విన్ 7/71)