ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. గ్రూప్ దశలో పరాజయం ఎరుగకుండా సెమీస్ చేరిన టీమ్ఇండియా.. శుక్రవారం అదే జోరు కనబర్చింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి ఐదు గోల్స్ తేడాతో జపాన్ను మట్టికరిపించింది. మరో సెమీస్లో మలేషియా 6-2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను చిత్తుచేయగా.. తుదిపోరులో మలేషియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
చెన్నై: భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. శుక్రవారం సెమీఫైనల్లో 5-0తో జపాన్ను చిత్తుచేసింది. గ్రూప్ దశలో జపాన్తో జరిగిన పోరును ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్.. ఈ సారి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (19వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తి సెల్వం (51వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రత్యర్థిని పూర్తి డిఫెన్స్లోకి నెట్టేసిన భారత్.. చివరి వరకు అదే జోరు కొనసాగించింది. నిజానికి జపాన్ మెరుగైన డిఫెన్స్ కనబర్చింది కాబట్టే భారత్ ఐదు గోల్స్తో సరిపెట్టుకుంది. లేకపోతే టీమ్ఇండియా ఖాతాలో మరిన్ని గోల్స్ చేరేవే! శనివారం జరుగనున్న తుదిపోరులో మలేషియాతో భారత్ తలపడనుంది.
ఆది నుంచి అదే జోరు..
60 నిమిషాల పాటు ఆధిపత్యం కనబర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ముందే చెప్పి బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు.. కీలక మ్యాచ్లో తమ మాట నిలబెట్టుకున్నారు. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా.. రెండో క్వార్టర్లో టీమ్ఇండియా విజృంభించింది. ఆకాశ్దీప్ సింగ్ చక్కటి ఫీల్డ్గోల్తో ఖాతా తెరువగా నాలుగు నిమిషాల తర్వాత పెనాల్టీ కార్నర్ను స్టార్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచాడు. మరికాసేపట్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా.. మాజీ కెప్టెన్ మన్దీప్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. దీంతో భారత్ 3-0తో తిరుగులేని స్థితికి చేరగా.. మూడో క్వార్టర్లోనూ ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. మ్యాచ్లో ఎక్కువ శాతం బంతి జపాన్ గోల్పోస్ట్ సమీపంలోనే కనిపించింది. సుమిత్ చక్కటి గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచగా.. యువ ఆటగాడు కార్తి సెల్వం మరో గోల్తో మ్యాచ్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ ద్వారా భారత సీనియర్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ అంతర్జాతీయ స్థాయిలో 300 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఆట ఆరంభానికి ముందు నిర్వాహకులు శ్రీజేశ్ను ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇదంతా అభిమానుల అండదండలతోనే సాధ్యమైందన్న రీతిలో శ్రీజేశ్ మోకాళ్లపై నిల్చొని ఇచ్చిన స్టిల్ అభిమానులను కట్టిపడేసింది.