దుబాయ్: టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. అగ్రస్థానాన్ని దక్కించుకొని సత్తాచాటింది. ఐసీసీ గురువారం టెస్టు టీమ్ ర్యాంకింగ్స్ వార్షిక ఆప్డేట్ను ప్రకటించగా.. కోహ్లేసేన (121 రేటింగ్ పాయింట్లు) నంబర్వన్ ర్యాంకులో నిలిచింది. భారత్తో జూన్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడనున్న న్యూజిలాండ్ (120) ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానానికి పరిమితమైంది. ఏడాది వ్యవధిలో ఆస్ట్రేలియాపై 2-1తో, ఇంగ్లండ్పై 3-1తో టీమ్ ఇండియా టెస్టు సిరీస్లు గెలిచి మొత్తం 2914 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ (109) ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని మూడో స్థానానికి వెళ్లగా.. ఆస్ట్రేలియా (108) నాలుగుకు చేరింది. ఏడో స్థానానికి దిగజారిన దక్షిణాఫ్రికా (80).. చరిత్రలోనే తమ అత్యంత కిందిస్థాయి ర్యాంకు నమోదు చేసుకుంది. శ్రీలంక (78) కూడా 8వ ర్యాంకుకు పడిపోయింది. పాకిస్థాన్ (94) ఐదో స్థానంలో కొనసాగగా.. రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న వెస్టిండీస్ (84) ఆరో ర్యాంకుకు ఎగబాకింది.