IND vs AUS | భారత్కు భంగపాటు! సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న టీమ్ ఇండియాకు దిమ్మతిరిగే ఝలక్. ఎదురైనా ప్రత్యర్థినల్లా ఓడిస్తూ వరుస సిరీస్ విజయాలు సొంతం చేసుకున్న భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. నాలుగేండ్ల తర్వాత తొలి సిరీస్ ఓటమిని చవిచూసింది. చెన్నైలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్సేనకు ఆస్ట్రేలియా చెక్ పెట్టింది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ వన్డే సిరీస్ను ఒడిసిపట్టుకుంది. బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ ఆసీస్కు సిరీస్ సమర్పించుకుంది. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం వృథా కాగా, సూర్యకుమార్ హ్యాట్రిక్ డకౌట్తో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చెన్నై: ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన రెండు జట్లలో ఆస్ట్రేలియానే అదృష్టం వరించింది. బుధవారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా సొంత ఇలాఖాలో నాలుగేండ్ల తర్వాత తొలి సిరీస్ ఓటమిని చవిచూసింది. ఆసీస్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు పరిమితమైంది. విరాట్ కోహ్లీ(54), హార్దిక్ పాండ్యా(40) చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచారు. ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో విజృంభించాడు. తొలుత ఆసీస్ 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్(47) టాప్ స్కోరర్గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా (3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీశారు. జంపాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, మార్ష్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.
లక్ష్యఛేదనలో ఓపెనర్లు రోహిత్శర్మ(30), గిల్(37) చెప్పుకోదగ్గ శుభారంభాన్ని ఇచ్చారు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ హిట్మ్యాన్ దూకుడు కనబరిచాడు. వీరిద్దరు వెంటనే ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన కోహ్లీ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్(32)తో ఇన్నింగ్స్ గాడిలో పడేసే ప్రయత్నం చేసినా..జంపా స్పిన్ తంత్రంతో టీమ్ఇండియా వరుసగా వికెట్లు చేజార్చుకుంది.
సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు. వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో స్టార్క్ బౌలింగ్లో ఔటైన సూర్య మూడో మ్యాచ్లో ఆగర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. వన్డేల్లో వరుసగా మూడు డకౌట్లు అయిన తొలి బ్యాటర్గా సూర్య నిలిచాడు.
ఆస్ట్రేలియా: 49 ఓవర్లలో 269(మార్ష్ 47, క్యారీ 38, హార్దిక్ 3/44, కుల్దీప్ 3/56), భారత్: 49.1 ఓవర్లలో 248(కోహ్లీ 54, హార్దిక్ 40, జంపా 4/45, ఆగర్ 2/41)