ప్రధాన ఆటగాళ్లు పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా చేరుకోగా.. యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది.
తొలి వన్డేలో భారత్ ఓటమి
9 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు
శాంసన్, శ్రేయస్ పోరాటం వృథా
ప్రధాన ఆటగాళ్లు పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా చేరుకోగా.. యువ ఆటగాళ్లతో కూడిన భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. వరుణుడి ఆటంకాల మధ్య సాగిన తొలి వన్డేలో శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమ్ఇండియా పోరాడినా విజయం సాధించలేకపోయింది. బౌలర్లు ఓ మోస్తరు ప్రదర్శన చేయగా.. టాపార్డర్ వైఫల్యం భారత్ను దెబ్బకొట్టింది. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ చివర్లో దంచికొట్టినా టీమ్ఇండియాకు పరాజయం తప్పలేదు.
లక్నో: భారత ప్రధాన జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లగా.. శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన పోరులో టీమ్ఇండియా చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
డేవిడ్ మిల్లర్ (63 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హన్రిచ్ క్లాసెన్ (65 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా.. క్వింటన్ డికాక్ (48) రాణించాడు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ధవన్ సేన 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ (63 బంతుల్లో 86 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 50; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ 3, రబడ రెండు వికెట్లు పడగొట్టారు. క్లాసెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రాంచీలో రెండో వన్డే జరుగనుంది.
ఆఖర్లో రాణించినా..
భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మూడో ఓవర్లో ఔట్ కాగా.. కాసేపటికే కెప్టెన్ శిఖర్ ధవన్ (3) అతడిని అనుసరించాడు. రుతురాజ్ గైక్వాడ్ (19), ఇషాన్ కిషన్ (20) కూడా విఫలమయ్యారు. దీంతో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ఇండియా కోలుకోవడం కష్టమే అనిపించినా.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ జట్టును ఆదుకున్నారు. ఒక ఎండ్లో శాంసన్ వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యమివ్వగా.. మరోవైపు శ్రేయస్ వరుస బౌండ్రీలతో విజృంభించాడు.
ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో అర్ధశతకం అనంతరం శ్రేయస్ ఔట్ కాగా.. శాంసన్కు శార్దూల్ ఠాకూర్ (33) జతయ్యాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లపై యుద్ధం ప్రకటించడంతో టీమ్ఇండియా మళ్లీ పోటీలోకి వచ్చింది. భారత విజయానికి 5 ఓవర్లలో 74 పరుగులు అవసరమైన దశలో శాంసన్ 2 ఫోర్లు అరుసుకోగా.. మరుసటి ఓవర్లో శార్దూల్ మూడు ఫోర్లు బాదాడు. దీంతో సమీకరణం 18 బంతుల్లో 46కు చేరగా.. సఫారీ పేసర్ ఎంగ్డీ వరుస బంతుల్లో శార్దూల్, కుల్దీప్ (0)ను ఔట్ చేసి దెబ్బకొట్టాడు. చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం కాగా.. శాంసన్ 6,4,4,4,తో రాణించినా ఫలితం లేకపోయింది.