ప్రతిష్ఠాత్మక టీ20 టోర్నీకి భారత్ పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నది. ఐపీఎల్ జోష్తో మెగాటోర్నీలో అడుగుపెట్టిన టీమ్ఇండియా…కూర్పుపై కసరత్తు చేస్తున్నది. ఇంగ్లండ్తో తొలి వామప్ మ్యాచ్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన ఆస్ట్రేలియాతో మలి మ్యాచ్కు సై అంటున్నది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తొలిపోరుకు ముందు సత్తాచాటాలన్న పట్టుదలతో కనిపిస్తున్న భారత్..ఆసీస్తో మ్యాచ్లో జట్టు కూర్పుపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్లో ఎవరికి అవకాశమివ్వాలి..ఎవరిని పక్కకు పెట్టాలనే దానిపై ఓ నిర్ణయానికి రానుంది. ఆల్రౌండర్ పాత్రకు సరైన న్యాయం చేయలేకపోతున్న హార్దిక్ పాండ్యా స్థానంపై టీమ్ మేనేజ్మెంట్ సమాలోచనలు చేస్తున్నది. మరోవైపు పొట్టి ఫార్మాట్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న ఆసీస్..భారత్తో మ్యాచ్లో సత్తాచాటేందుకు తహతహలాడుతున్నది. ఈ నేపథ్యంలో మేటి జట్ల మధ్య సన్నాహక పోరు రంజుగా సాగే అవకాశముంది.
దుబాయ్: టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ మరో సన్నాహక పోరుకు సిద్ధమైంది. 14 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదలతో కనిపిస్తున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఐపీఎల్తో వచ్చిన మ్యాచ్ ప్రాక్టీస్ను కొనసాగిస్తూ మెగాటోర్నీలో మెరువాలని చూస్తున్నది. కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అయిన నేపథ్యంలో ఎలాగైనా కప్ గెలువాలన్న కసితో కనిపిస్తున్నది. ఇంగ్లండ్తో జరిగిన తొలి వామప్ మ్యాచ్లో కోహ్లీసేన సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్లు ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో విరుచుకుపడ్డారు. ఐపీఎల్ ఫామ్ను దిగ్విజయంగా కొనసాగిస్తూ ఇంగ్లిష్ బౌలర్లపై ఉప్పెనలా విరుచుకుపడ్డారు. అటు బౌలింగ్లోనూ షమీ, బుమ్రా, రాహుల్ చాహర్ ఆకట్టుకోగా, స్వింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. రోహిత్శర్మకు తోడుగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా రావడం దాదాపు ఖరారు కాగా, మిడిలార్డర్పై సందిగ్ధత కొనసాగుతున్నది. ఆసీస్తో బుధవారం నాటి వామప్ మ్యాచ్తో బ్యాటింగ్ ఆర్డర్పై మరింత స్పష్టత రానుంది. కెప్టెన్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశముండగా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, జడేజా, హార్దిక్ పాండ్యా మిడిల్లో మెరుపులు మెరిపించనున్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్తో సన్నాహక పోరులో బుమ్రా, షమీ రాణించగా, భువనేశ్వర్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్..పరుగులు నియంత్రించగా లెగ్స్పిన్నర్ రాహుల్ చాహర్ ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు.
ఆసీస్తో వామప్ మ్యాచ్లో టీమ్ఇండియా.. బ్యాటింగ్ ఆర్డర్ పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్తో పోరులో విశ్రాంతి తీసుకున్న వైస్ కెప్టెన్ రోహిత్శర్మ..బ్యాటింగ్కు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే రాహుల్కు విశ్రాంతి ఇవ్వవచ్చు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా బ్యాట్లు ఝులిపించేందుకు తహతహలాడుతున్నారు. తమదైన రోజైన ప్రత్యర్థి బౌలింగ్ను చీల్చి చెండాడే వీరు..ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆల్రౌండర్ కోటా కోసం హార్దిక్ పాండ్యా, జడేజా, శార్దూల్ ఠాకూర్ పోటీపడుతున్నారు. వెన్నెముకకు శస్త్రచికిత్స తర్వాత నుంచి బౌలింగ్కు దూరంగా ఉంటున్న హార్దిక్..పూర్తిస్థాయి బ్యాట్స్మన్గా సేవలందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్కు బదులుగా ఆల్రౌండర్గా జడేజా, శార్దూల్లో ఒకరిని తీసుకునే అవకాశం కనిపిస్తున్నది. ఈ కూర్పుకు కట్టుబడితే హార్దిక్కు మొండిచేయి ఎదురుకావచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో శార్దూల్, జడేజా అంచనాలకు మించి రాణిస్తున్నారు.
న్యూజిలాండ్తో మొదటి వామప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తీవ్ర తడబాటుకు గురైంది. ముఖ్యంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్లో అర్ధాంతరంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వార్నర్..కివీస్తో మ్యాచ్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. మిడిలార్డర్ మొత్తం కుప్పకూలగా, ఆఖర్లో ఆస్టన్ ఆగర్(23), స్టార్క్(13) ఆకట్టుకున్నారు. చివర్లో కొత్త కుర్రాడు జోష్ ఇంగ్లిస్ రెండు ఫోర్లు జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. లేకపోతే ఆసీస్ ఓటమివైపు నిలువాల్సి వచ్చేది. దీనికి తోడు పొట్టి ఫార్మాట్లో ఆసీస్ ఈ మధ్య కాలంలో ఆశించిన విజయాలు అందుకోలేకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది.
ఆస్ట్రేలియాతో సన్నాహక పోరులో బౌలర్ల కూర్పును పరిశీలించనున్నారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను తీసుకోవచ్చు. మరోవైపు ఐపీఎల్లో కోల్కతా తరఫున అదరగొట్టిన యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి బ్యాటర్ను తనదైన స్పిన్ మాయాజాలంతో ముప్పుతిప్పలు పెడుతున్న ఈ చెన్నై స్పిన్నర్..తుది జట్టు ఎంపికపై ఒక అంచనాకు రానున్నారు.