పట్టు బిగిస్తున్న టీమ్ఇండియా
భారత్ తొలి ఇన్నింగ్స్ 327
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 197
భారత్ రెండో ఇన్నింగ్స్ 16/1
ఒకే రోజు 18 వికెట్లు
146 పరుగుల ఆధిక్యంలో కోహ్లీసేన
సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన టీమ్ఇండియా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటర్ల పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో బాక్సింగ్ డే టెస్టుపై పట్టు బిగించింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా ఓ వికెట్ కోల్పోయినా.. ఓవరాల్గా 146 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఒక్క రోజే మూడు ఇన్నింగ్స్లు సాగిన ఈ పోరులో.. మంగళవారం 18 వికెట్లు నేలకూలడం గమనార్హం. మరో రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో.. బుధవారం కోహ్లీసేన
ప్రత్యర్థికి ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి!
సెంచూరియన్: సఫారీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలువాలని తహతహలాడుతున్న టీమ్ఇండియా.. దానికోసం వడివడిగా అడుగులు వేస్తున్నది. టాపార్డర్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసిన భారత్.. అనంతరం ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీసేన మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 130తో కలుపుకొని ఓవరాల్గా టీమ్ఇండియా 146 పరుగుల ముందంజలో ఉండగా.. స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ (5), నైట్ వాచ్మన్ శార్దూల్ ఠాకూర్ (4) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 272/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 327 పరుగులకు ఆలౌటైంది. మంగళవారం మరో 55 పరుగులు జోడించిన టీమ్ఇండియా మిగిలిన ఏడు వికెట్లు చేజార్చుకుంది. రాహుల్ (123), రహానే (48) వెంటవెంటనే ఔట్ కాగా.. పంత్ (8), అశ్విన్ (4), శార్దూల్ (4), షమీ (8), బుమ్రా (14) పెవిలియన్కు క్యూ కట్టారు. సఫారీ బౌలర్లలో ఎంగ్డీ 6, రబడ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 197 పరుగులకు ఆలౌటైంది. బవుమా (52) టాప్ స్కోరర్ కాగా.. డికాక్ (34), రబడ (25) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. సఫారీ టాపార్డర్ ఆటగాడు మార్క్మ్న్రు షమీ క్లీన్బౌల్డ్ చేసిన విధానం చూసి తీరాల్సిందే. షమీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతికి ఆఫ్స్టంప్కు దూరంగా వెళుతుందని భావించి మార్క్మ్ దాన్ని వదిలేయగా.. అనూహ్యంగా ఇన్స్వింగ్ అయిన బాల్.. ఆఫ్స్టంప్ను గిరాటేసింది. ఈ క్రమంలోనే షమీ టెస్టు క్రికెట్లో 200 వికెట్లు పూర్తి చేసుకోగా.. తొలి స్పెల్లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ బుమ్రా.. ఆట ఆఖర్లో తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. రెండో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకపోగా.. మంగళవారం ఒక్క రోజే మూడు ఇన్నింగ్స్లు సాగాయి.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 327 (రాహుల్ 123, మయాంక్ 60; ఎంగ్డీ 6/71, రబడ 3/72), దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్ (బవుమా 52, డికాక్ 34; షమీ 5/44, బుమ్రా 2/16), భారత్ రెండో ఇన్నింగ్స్: 6 ఓవర్లలో 16/1 (రాహుల్ 5 బ్యాటింగ్; శార్దూల్ 4 బ్యాటింగ్; జాన్సెన్ 1/4).