చెన్నై: టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. సెమీఫైనల్ బెర్తు దక్కించుకోవాలంటే తప్పక గెలువాల్సిన స్థితిలో టీమ్ఇండియా కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో భారీ ఓటమితో సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న సూర్యకుమార్యాదవ్ సేన..గురువారం జింబాబ్వేతో కీలక పోరులో తలపడనుంది. మెగాటోర్నీలో ముందంజ వేయాలంటే మిగతా జట్ల గెలుపు, ఓటములపై ఆధారపడాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్న టీమ్ఇండియా ముందంజ వేయాలంటే శక్తికి పోరాడాల్సి ఉంది. పొట్టి ఫార్మాట్లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ డిఫెండింగ్ చాంపియన్గా ప్రపంచకప్లో అడుగుపెట్టిన భారత్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నది.
మెగాటోర్నీకి ముందు మన బ్యాటర్లు పరుగుల వరద పారిస్తూ భారీ స్కోర్లు నమోదు చేయగా, ప్రస్తుతం ఘోరంగా తడబడుతున్నారు. అలవాటైన సొంత ఇలాఖాలో పిచ్లపై పరుగులు సాధించడంలో ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా టీ20 ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్న ఓపెనర్ అభిషేక్శర్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఘోరంగా వమ్ము చేస్తున్నాడు. మూడు మ్యాచ్ల్లో సున్నా చుట్టిన ఈ యువ బ్యాటర్..సఫారీలపై పరుగుల ఖాతా తెరిచాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే స్పిన్నర్లకు వికెట్ సమర్పించుకుంటున్న అభిషేక్..జింబాబ్వేతో పోరులో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే టోర్నీలో అంతోఇంతో రాణిస్తున్న ఇషాన్ కిషన్..అభిషేక్ను అనుసరిస్తూ దక్షిణాఫ్రికాతో పోరులో సున్నా చుట్టాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ఆసియాకప్ హీరో తిలక్వర్మ బ్యాటు ఝులిపించలేకపోతున్నాడు. ముగ్గురు లెఫ్ట్హ్యాండర్లతో కూడిన టాప్-3 బ్యాటింగ్ ఆర్డర్ లోపాలను అంచనా వేసిన ప్రత్యర్థి జట్లు స్పిన్తో దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ శాంసన్ తీసుకుంటే లెఫ్ట్రైట్ కాంబినేషన్లో దాడికి దిగవచ్చని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది. సుందర్ స్థానంలో అక్షర్పటేల్ రాక ఖరారు కాగా, ఎక్స్ట్రా స్పిన్నర్ రూపంలో కుల్దీప్యాదవ్ను తీసుకునే అవకాశముంది.
తిలక్, రింకూ ఇద్దరిలో ఒకరిని పక్కకుపెడుతూ శాంసన్ తుది జట్టులోకి తీసుకోనున్నారు. బౌలింగ్లో బుమ్రా, అర్ష్దీప్సింగ్ రాణిస్తున్నా..వరుణ్ నిలకడ ప్రదర్శించలేకపోతున్నాడు. మరోవైపు జింబాబ్వే మెగాటోర్నీలో మేటి జట్లకు షాక్ ఇస్తూ సూపర్-8లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వే..వెస్టిండీస్ను దీటుగా ఎదుర్కొలేకపోయింది. ఓవైపు భారీ హిట్టర్లకు తోడు పేస్, స్పిన్నర్లతో జింబాబ్వే సమతూకంగా కనిపిస్తున్నది. చెన్నైలో ఎవరిది పైచేయి అవుతుందనేది చూడాలి.